జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిపై టిక్టాక్ వీడియో తీశాడు..జైలుపాలు అయ్యాడు..
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభ్యంతరకరంగా టిక్టాక్ వీడియోను రూపొందించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరాల కింద అతనిపై కేసు నమోదు చేశారు. కడప జిల్లాలోని మైదుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. మైదుకూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి ఈ టిక్టాక్ వీడియోను రూపొందించాడు. ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీ సహా ప్రభుత్వ పనితీరును విమర్శించాడని, వైఎస్ జగన్ను ఈ వీడియో ద్వారా అభ్యంతరకంగా దూషించాడ పోలీసులు వెల్లడించారు. కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డినీ వదల్లేదు.
Recommended Video
మళ్లీ వివాదం: గరుడ వారధి పిల్లర్లపై గోవిందుడి తిరునామాలు తొలగింపు: వాటి స్థానంలో.. !
మద్యం ధరలు భారీగా పెంచడం, రాత్రి ఎనిమిది గంటల వరకే మద్యం దుకాణాలను మూసివేయించడం వంటి అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం మద్యం పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, మద్యం అందుబాటులో ఉంచకపోవడం సరైన చర్యలు కాదని విమర్శిస్తూ ఈ టిక్టాక్ వీడియోను రూపొందించాడు. వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలను దైషించాడు. దాన్ని సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశాడు.
దీనిపై అదే నియోజకవర్గంలోని దువ్వూరు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు జయచంద్రా రెడ్డి మైదుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. మరుసటి రోజు సాయంత్రం పుల్లయ్యను అరెస్టు చేశారు. సైబర్ చట్టం కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.