టైమ్స్ నౌ సర్వే-ఏపీలో వైసీపీదే హవా: జగన్ పార్టీకి 23 ఎంపీ సీట్లు, టీడీపీకి రెండే: కారణం ఇదేనా?
అమరావతి: వచ్చే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని టైమ్స్ నౌ వీఎంఆర్ ప్రీపోల్ సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం జగన్ పార్టీకి ఏపీలో 23 లోకసభ సీట్లు, అధికార తెలుగుదేశం పార్టీకి రెండు లోకసభ సీట్లు వస్తాయి. ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెబుతున్నాయి.
వైసీపీలో నూతన ఉత్సాహం
ఇటీవల పలు సర్వేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోకసభ సీట్లు ఎక్కువగా వస్తాయని చెబుతున్నాయి. గత రెండు మూడు నెలల సర్వేలను పరిశీలిస్తే వైసీపీకి 13 సీట్లు, 19 సీట్లు, 21 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇప్పుడు ఏకంగా 25 లోకసభ సీట్లకు గాను 23 సీట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. ఇది వైసీపీలో అత్యంత ఉత్సాహాన్ని నింపే విషయమే. ఎందుకంటే 25 లోకసభ స్థానాలకు గత 2014 ఎన్నికల్లో గెలుచుకున్న సీట్ల కంటే మూడు రెట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి.ఈ సర్వే ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49.5 శాతం ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 36 శాతం ఓట్లు రానున్నాయి.
కాంగ్రెస్-టీడీపీ పొత్తు లేకపోవడం వైసీపీకి ప్లస్
ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే టీడీపీకి నష్టమని, వైసీపీకి లాభమని పలు సర్వేలు వెల్లడించాయి. అదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే వైసీపీ సీట్లు 13కు, టీడీపీ - కాంగ్రెస్ సీట్లు 11కు పెరుగుతాయని వెల్లడించాయి. ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తు తేలిపోయింది. ఆ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి ఇది ప్లస్ అయిందని, అందుకే 23 సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
టీడీపీ వాదన ఏమంటే
కాగా, ఈ ప్రీపోల్ సర్వే ఫలితాలను తెలుగుదేశం పార్టీ కొట్టి పారేస్తోంది. ఇలాంటి సర్వేలు చేయించుకోవడం జగన్కు అలవాటేనని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిప్పులు చెరిగారు. ఈ ప్రీ సర్వే ఫలితాలను నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు.