తిరుమల: మంత్రి కొడాలి నాని బిగ్ బాంబ్ - మోదీని భార్యతో వెళ్లమనండి - వీర్రాజుకు పదవి తర్వాతే దాడులు
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ డిక్లరేషన్ అంశంపై రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే ఆలయంలో అడుగుపెట్టాలని ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. సాక్ష్యాత్తూ టీటీడీనే సీఎంను ఆహ్వానించింది కాబట్టి డిక్లరేషన్ అవసరమే లేదని అధికార వైసీపీ వాదిస్తున్నది. ఈ క్రమంలో మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ మౌనం బద్దలైతే ఊడేదేంటి? - అమిత్ షాతో ఆ విషయమా? స్వరూపానంద మౌనమేల?: ఎంపీ రఘురామ
తిరుమలో మంత్రుల మకాం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ బుధవారం తిరుమలకు చేరారు. ఆయనకంటే ముందే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మరో మంత్రి కొడాలి నాని కొండపైనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేంకటేశ్వర స్వామి సన్నిధిలో డిక్లరేషన్పై కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీయేతర పార్టీలు, హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్షమాపణలు చెప్పాలని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతుండగా.. డిక్లరేషన్, సతీసమేతంగా శ్రీవారి దర్శనం అంశాలపై మంత్రి మరోసారి మీడియా ముదుకొచ్చారు..
మోదీని భార్యతో వెళ్లమనండి..
‘‘జగన్ తన సతీమణితో కలిసి తిరుమల వెళ్లడానికి అభ్యంతరమేంటని టీడీపీ, బీజేపీకి చెందిన కొందరు నాయకులు పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో ప్రధాని మోదీ బజారున పడే పరిస్థితి నెలకొంది. జగన్ భార్య గురించి మాట్లాడేముందు.. నరేంద్ర మోదీని సతీసమేతంగా ఆలయాలకు వెళ్లమని చెప్పుకోండి'' అని మంత్రి నాని అన్నారు. సీఎం జగన్ కు శ్రీవారిపై నమ్మకం ఉంటే డిక్లరేషన్ పై సతకం చేయాలని, సతీమణి వైఎస్ భారతిని వెంటపెట్టుకెళ్లి దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించాలని బీజేపీ, టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
శ్రీవారి దయవల్లే జగన్ సీఎం..
తిరుమలలో డిక్లరేషన్ వ్యవస్థ అవసరమా అన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీనిపై ప్రజల్లో, మత పెద్దల్లో చర్చ జరగాలని, అసలీ నిబంధన వెనకున్న కార్యకారణాలన్నీ బహిర్గతం కావాల్సిన అవసరం ఉందని మంత్రి నాని అన్నారు. సీఎం జగన్కు కులాల, మతాలతో సంబంధం లేదని, దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా, చర్చిలో క్రైస్తవుడిలా, మసీదులో సమయంలో నవాబులా ఉంటారని తెలిపారు. చివరికి చంద్రబాబు కూడా శ్రీవారిని రాజకీయాలకు వాడుకోవడం బాధకలుగుతోందన్నారు. వేంకటేశ్వరస్వామి దయవల్లే జగన్ సీయం అయ్యారని, టీటీడీ ఆహ్వానం మేరకే పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్నారు కాబట్టి డిక్లరేషన్ అవసరమే ఉండదని నాని పేర్కొన్నారు.
వీర్రాజు ఎంపికయ్యాకే దాడులు..
రాష్ట్రంలో పలు చోట్ల ఆలయాలపై దాడులు జరగడం శోచనీయమని, వాటిని నివారించడానికి ప్రభుత్వం, పోలీసులు కృషి చేస్తున్నారని మంత్రి నాని చెప్పారు. అయితే, దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉండొచ్చని, లబ్ది కోసం కొందరు పనిగట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారనడానికి ఆధారాలు కూడా లభించాయని, మరీ ముఖ్యంగా.. ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత ఆలయాలపై దాడులు పెరిగాయని మంత్రి గుర్తుచేశారు.
Recommended Video
జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు