ఆన్ లైన్ లోనూ మొక్కులు చెల్లిస్తున్న శ్రీవారి భక్తులు ... లాక్ డౌన్ ఆదాయం ఎంతో తెలుసా!!
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా లాక్ డౌన్ దెబ్బకు కలియుగ వైకుంఠ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన ఆలయం మీద కూడా పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే .ఇక ఇటీవల సామాజిక దూరం పాటిస్తూ చాలా మార్పులు చేసి దర్శనాలకు అనుమతి ఇస్తారని భావిస్తే అది సాధ్యంకాదని ఈ నెలాఖరు వరకు భక్తులకు దర్శనాలు నో అని చెప్పేసింది టీటీడీ. కానీ నిత్యం స్వామివారి కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఇక ఈనెల 28వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో దర్శనాల విషయంలో నిర్ణయం తీసుకుంటారు .
lockdown 4.0 : ఏపీలో ఈనెల 31 వరకు దేవాలయాల్లో దర్శనాలు రద్దు : మంత్రి వెల్లంపల్లి
ఆన్ లైన్ లోనూ స్వామీ వారి భక్తుల కానుకలు
లాక్ డౌన్ సడలింపు ఇచ్చి స్వామివారి దర్శనాలకు వెసులుబాటు కల్పిస్తారని భావిస్తే అలాంటిదేమీ లేదని చెప్పేశారు . దీంతో భక్తులు నిరాశకు గురయ్యారు. కానీ కరోనా కష్టకాలంలో కూడా స్వామివారి మీద భక్తి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు కొందరు భక్తులు . శ్రీవారి భక్తులు ఆన్ లైన్ ద్వారా స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు . దీంతో లాక్డౌన్ సమయంలోనూ తిరుమల శ్రీవారి ఆదాయం ఏమాత్రం తగ్గలేదని సమాచారం . ఆన్లైన్ ద్వారా శ్రీవారికి తమ కానుకలను పంపిస్తున్న భక్తులు స్వామి వారి ముడుపులు బాగానే సమర్పించుకుంటున్నారు .
గత ఏడాది రూ.90 లక్షల ఆదాయం... ఈసారి కూడా అంతే మొత్తంలో ..
గతేడాది ఏప్రిల్లో తిరుమల శ్రీవారికి ఆన్లైన్ ద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏప్రిల్లో నమోదైన హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో ఉన్నట్టు సమాచారం . కరోనా లాక్డౌన్తో 59 రోజుల పాటు శ్రీవారికి భక్తులు దూరమైనా కానుకలు మాత్రం ఆన్లైన్ హుండీ ద్వారా పంపుతున్నారు. ఈ సమయంలోనూ భక్తులు శ్రీ వెంకటేశ్వరుడికి ఆన్లైన్ కానుకలు సమర్పించి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు.
హుండీ ఆదాయం తగ్గటంతో జీతాలకు ఇబ్బంది .. అయినా జీతాల చెల్లింపులు
తిరుమల శ్రీవారి దర్శనాలకు అనుమతి లేకపోవటంతో హుండీ ఆదాయం బాగా తగ్గింది. దీంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి ఇబ్బంది వచ్చిందని ఈమధ్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రకటించారు. బ్యాంకులలో డిపాజిట్ మనీని జీతాల కోసం వాడలేము అని టీటీడీ స్పష్టం చేసింది . రోజువారీ వచ్చే హుండీ ఆదాయాల్లోనే అవన్నీ సెట్ చెయ్యాల్సి ఉంటుందని , హుండీ ఆదాయం పడిపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్న విషయం తెలిసిందే . ఇక రెండు రోజుల క్రితం టీటీడీ ఉద్యోగుల జీతాలు చెల్లింపులు చేస్తున్నామని, లోక్డౌన్ నేపథ్యంలో దర్శనం నిలిపివేయ్యడంతో టీటీడీకి వచ్చే ఆదాయం తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ గత రెండు నెలలుగా ఉద్యోగుల జీతాలు చెలిస్తున్నామని టీటీడీ పేర్కొంది.