మళ్లీ ప్రమాదం: శ్రీవారి మెట్టు వద్ద కార్చిచ్చు
తిరుపతి: శేషాచలం ఆపరేషన్ విజయవంతమైందని భావిస్తున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం తిరుమల శ్రీవారి మెట్టు వద్ద కార్చిచ్చు ప్రారంభమైంది. మూడు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను నిలిపేశారు. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి.
ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. హెలికాప్టర్లు ఏరియల్ సర్వేకు బయలుదేరాయి. ఏడుకొండలపై చెలరేగిన దావానలాన్ని చల్లార్చేందుకు చేపట్టిన ఆపరేషన్ శేషాచలం విజయవంతమైంది. గురువారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో అటవీ, రక్షణ శాఖల ఉన్నతాధికారుల సమావేశం అనంతరం కేంద్ర అటవీ శాఖ సంచాలకుడు, ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ గార్బ్యాల్, టిటిడి ఈవో గోపాల్ ఈ మేరకు ప్రకటన చేశారు.
కేంద్ర అటవీ, రక్షణ శాఖల సంయుక్త సహకారంతో కార్చిచ్చును అదుపులోకి తీసుకురాగలిగామని వారు చెప్పారు. ఈ సమావేశంలో వీరితో పాటు ప్రిన్సిపల్ చవచవఎఫ్ సోమశేఖర్ రెడ్డి, కేంద్ర అగ్నిమాపక సలహాదారు డికె షమ్మీ, ఫైర్ డిజి సాంబశివరాలు తదితరులు పాల్గొన్నారు. శేషాచలం అడవుల్లో మంగళవారం మొదలైన మంటలు బుధవారానికి ఉధృతంగా మారడంతో, వాటిని ఆర్పేందుకు హెలికాప్టర్లను రంగంలోకి దించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నాలుగు హెలికాప్టర్లతో కేంద్ర రక్షణ శాఖ గురువారం రంగంలోకి దిగింది. వాటిలో రెండు హెలికాప్టర్లు ఏరియల్ సర్వే చేస్తూ సందేశాలు అందిస్తుంటే.. నీటి తొట్టెలు (బాంబీ బకెట్లు) ఉన్న మరో రెండు హెలికాప్టర్లు వాటిని అనుసరిస్తూ మంటలపై నీటిని కుమ్మరించాయి.