కలియుగ వైకుంఠం తిరుమలను..కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలట: జగన్కు బీజేపీ నేత సూచన..!
తిరుపతి: ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన భయానక కరోనా వైరస్ను మట్టుబెట్టడానికి భారత్ సహా ప్రపంచదేశాలు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎవరు, ఎన్ని రకాలుగా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ.. ఈ వైరస్ తీవ్రత మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. పైగా- మరింత విజృంభిస్తోంది.. అడ్డు, అదుపనేది లేకుండా చెలరేగిపోతోంది. వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. లక్షలాది మంది ప్రజల శరీరాల్లో తిష్టవేసుకుని కూర్చుంది.
ఐసొలేషన్ కేంద్రాలుగా..
ఒక్క మన రాష్ట్రంలోనే 27 వేల మందికి పైగా స్థానికులు విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. ఈ వైరస్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గానికి వంద పడకల సామర్థ్యంతో ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పింది. జిల్లా కేంద్రం స్థాయిలో ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. కళాశాలలు, పాఠశాలలు, కల్యాణమండపాలు.. ఇవన్నీ ప్రస్తుతం ఐసొలేషన్ కేంద్రాలుగా అవతరించాయి.
సోషల్ మీడియా చర్చలో ప్రముఖులు..
ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ఓ సరికొత్త చర్చ ప్రారంభమైంది. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠంలా ఆరాధిస్తోన్న తిరుమలను కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. దీన్ని లేవనెత్తిన వారిలో ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తిరుమలను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు.
గుడ్ ఐడియా అంటోన్న ఐవైఆర్
తిరుమలను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలనే డిమాండ్ పట్ల రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఈ ఆలోచనను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ ఆయన వైఎస్ జగన్కు సూచించడం కొసమెరుపు. ఐవైఆర్ కృష్ణారావు అల్లాటప్పా వ్యక్తేమీ కాదు. విభజన తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. పైగా బీజేపీ నేత. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా.. ఐవైఆర్ కృష్ణారావు వంటి మాజీ బ్యురోక్రాట్, బీజేపీ నాయకుడు ఈ ప్రతిపాదనను మెచ్చుకోవడంతో అది కాస్తా సంచలన వార్తగా మారింది.
అన్ని వసతులు ఉండటం వల్లే..
ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచీ వచ్చే భక్తుల సౌకర్యం కోసం వందల సంఖ్యలో గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న ఆ గదులను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చితే బాగుంటుందంటూ వచ్చిన ఓ సందేశాన్ని ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి రీట్వీట్ చేశారు. ఇది మంచి ఆలోచన అని కితాబిచ్చారు. ఈ దిశగా ఆలోచన చేయాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. వైఎస్ జగన్కు ట్యాగ్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడా విషయం సంచలనం రేపుతోంది.