జూలై 27 న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత...గురువారం ఒంటిగంటకే క్యూ లైన్లు క్లోజ్
Recommended Video
తిరుమల: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జూలై 27 శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం వేకువజాము 3.49 గంటల వరకు చంద్రగ్రహణం సంభవించనున్న సంగతి తెలిసిందే.
ఆనవాయితీ ప్రకారం చంద్ర గ్రహణం మొదలయ్యే సమయానికి ఆరు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయడం అనాదిగా వస్తున్నదే. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను మూసివేసి...తిరిగి గ్రహణం వీడిన తర్వాత శనివారం వేకువజామున 4.15గంటలకు తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆ తరువాత ముందుగా సుప్రభాత సేవతో పాటు శుద్ధి, పుణ్యాహవచనం జరుగుతుంది. అనంతరం తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి, ఉదయం 7గంటల నుంచి భక్తులను యథావిథిగా దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకే సర్వదర్శనం క్యూలైన్ మూసివేయనున్నారు. అయితే అప్పటికే క్యూలో, కంపార్టుమెంట్లో వేచివున్న భక్తులకు గురువారం అర్థరాత్రి వరకు దర్శనం చేయిస్తారు.
అయినప్పటికీ ఇంకా క్యూ ల్లో భక్తులు మిగిలివున్ పక్షంలో వారికి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు దర్శన భాగ్యం కలిగించి ఇక ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. మరోవైపు అభిషేకం కారణంగా శుక్రవారం దర్శనం ఆలస్యంగా మొదలుకానున్నట్లు సమాచారం. ఈ కారణంగా కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే వీఐపీ టికెట్లను పరిమితం చేశారని తెలిసింది.
శుక్రవారం ఆలయం మూసివేత సందర్భంగా రూ.300 టికెట్లు, స్లాట్ బుకింగ్ దివ్య, సర్వదర్శనం టోకెన్ల జారీని ఇప్పటికే రద్దు చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం భోజనం వితరణ తరువాత అన్నదాన సముదాయాలు, కౌంటర్లు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గ్రహణం సందర్భంగా 27న నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పున్నమి గరుడసేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు.