మరోసారి మూతపడబోతోన్న తిరుమల శ్రీవారి ఆలయం: తిరుపతి అనుబంధ ఆలయాలు కూడా
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీవారి ఆలయం మరోసారి మూతపడబోతోంది. తిరుపతిలోని అనుబంధ ఆలయాలను కూడా మూసివేయబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం.. సూర్యగ్రహణం కావడమే. సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నింటినీ కొన్ని గంటల పాటు మూసివేయనున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి యధాతథంగా శ్రీవారి ఏకాంతసేవను పూర్తి చేసిన అనంతరం ఆలయ తలుపులను మూసివేస్తారు.
చైనా ఆటవిక దాడి: భారత జవాన్లపై మేకులు గుచ్చిన ఇనుప రాడ్లతో విరుచుకుపడ్డారా?: చైనా ఆటవిక దాడి
తిరుపతి అనుబంధ ఆలయాల్లోనూ
మరుసటి రోజు తెల్లవారు జామున 3: 30 గంటలకు ఆలయాన్ని తెరవాల్సి ఉన్నప్పటికీ.. సూర్యగ్రహణం కారణంగా ఆలస్యంగా శ్రీవారి సేవలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30కు శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతి ఇస్తారు. గ్రహణం కాలం ముగిసిన తరువాత ఆలయాన్ని శుద్ధి చేస్తారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం సహా తిరుపతిలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ఇదేరకమైన పద్ధతులను అనుసరిస్తారు. ఆదివారం ఉదయం 10.18 గంటల నుంచి మధ్యాహ్నం 1.38 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూన్ 21న మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకు శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం, సహస్రనామార్చన, నిత్యార్చన చేపడతారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు శుద్ధి, మొదటి గంట, రెండో గంట, రాత్రి గంట నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రి 7.30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆలయంలో ఆ రోజంతా భక్తులకు దర్శనం ఉండదు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూన్ 21 మధ్యాహ్నం 3.45 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు ఆలయశుద్ధి, పుణ్యాహవచనం, తోమాలసేవ, సహస్రనామార్చన, మొదటి గంట, రెండో గంట నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు రాత్రి తోమాలసేవ, రాత్రి గంట అనంతరం ఏకాంత సేవ నిర్వహిస్తారు.
Recommended Video
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం, ఇతర కైంకర్యాల ఆనంతరం మధ్యాహ్నం 4.30 గంటల నుండి 6 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం, ఇతర కైంకర్యాల ఆనంతరం రాత్రి గంట నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. భక్తులకు దర్శనం ఉండదని టీటీడీ అధికారులు వెల్లడించారు.