25.7 లక్షలు: ఉద్యోగులు, కుటుంబసభ్యులు శ్రీవారికి సమర్పణ, సోమవారం ఒక్కరోజే, రేపటినుంచి భక్తులకు..
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ట్రయల్ రన్లో భాగంగా టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. అయితే సోమవారం దర్శించుకొన్న వారు స్వామివారికి పూజలు చేసి.. కానుకలు సమర్పించారు. అలా సోమవారం స్వామి వారి హుండీలో సమర్పించిన నగదు లెక్కించగా.. రూ.25.7 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
6 వేల మంది
సోమవారం ఉద్యోగులు, కుటుంబసభ్యులు కలిసి 6 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు ట్రయల్ రన్ కొనసాగుతోంది. గురువారం నుంచి సామాన్య భక్తులకు అనుమతి ఇస్తారు. వాస్తవానికి తిరుమల శ్రీవారిని రోజుకు 60 వేల మంది దర్శించుకునే వారు. కానీ కరోనా వైరస్ వల్ల గురువారం నుంచి కేవలం 6 వేల మందిని మాత్రమే అనుమతిస్తారు.
500 మంది పీపీటీ కిట్స్
భక్తుల దర్శనం కోసం క్యూ లైన్లలో భౌతిక దూరం పాటించేందుకు 500 మంది సిబ్బంది పీపీఈ మాస్క్ ధరించి విధులు నిర్వహిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించనుంది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భక్తులను పరీక్షించి.. అనుమతిస్తారు. అయితే పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్దులను మాత్రం అనుమతించరు.
Recommended Video
80 రోజుల తర్వాత
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూ వస్తోంది. దీంతో తిరుమల ఆలయంలో దర్శనాలను కూడా మార్చి నెలలో నిలిపివేశారు. దాదాపు 80 రోజులపాటు స్వామివారి కైంకర్యాలు నిలిచిపోయాయి. అన్ లాక్ 1.0తో సోమవారం నుంచి ఆలయాలు తెరచుకున్న సంగతి తెలిసిందే. కానీ టీటీడీ మాత్రం తిరుమలలో మూడురోజులు ఉద్యోగులతో ట్రయల్ రన్ నిర్వహించింది. గురువారం నుంచి భక్తులకు తిరుమల శ్రీవారు సతీ సమేతంగా దర్శనం ఇవ్వబోతున్నారు.