TTD: తిరుమలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం: అత్యవసర సేవల కింద టీటీడీ: ఎస్మా ప్రయోగానికీ..!
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ ప్రభావం తిరుమలపై తీవ్రంగానే పడింది. సుమారు 50 రోజులుగా కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలను సందర్శించే లక్షలాది మంది భక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల స్వామివారికి వచ్చే ఆదాయం స్తంభించింది. శ్రీవారికి హుండీ రూపంలో అందాల్సిన కానుకలు, ఆర్జిత సేవల రూపంలో విక్రయం అయ్యే టికెట్లు, లడ్డుల అమ్మకాల రూపంలో వచ్చే ఆదాయానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.
Jagan Killed AP: టీడీపీ సరికొత్త స్లోగన్: ఉన్మాది కొడుకులా ఆస్తులను తెగనమ్ముతున్న జగన్
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని
ఫలితంగా- ఉద్యోగులు, ఇతర సిబ్బందికి వేతనాలను కూడా చెల్లించలేకపోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిత్యావసర సరుకులు, ఇతర దుకాణాలను తెరవడానికి, రైలు ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం సడలింపులను ఇచ్చింది. ఆలయాల్లో భక్తుల రాకపోకలపై ఆంక్షలు యధాతథంగా కొనసాగిస్తోంది. భక్తులు రాకపోవడం వల్ల నిధుల కొరత ఏర్పడింది టీటీడీకి.
గురువారం ఉత్తర్వులను జారీ చేశారు
ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అత్యవసర సర్వీసుల చట్టం (ఎస్మా) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. టీటీడీలో ఆరునెలల పాటు సమ్మెలను నిషేధించింది. సమ్మెలను నిషేధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి.
దీనికోసం ప్రతి ఆరునెలలకు ఒకసారి
సాధారణంగా ప్రభుత్వం పరిధిలో అన్ని శాఖలు ఆటోమేటిక్గా ఎస్మా పరిధిలోనే కొనసాగుతుంటాయి. ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్, పూర్వపు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఐఐసీ, పౌరసరఫరాల సంస్థ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు కూడా ఎస్మా పరిధిలోనే ఉంటాయి. దీనికోసం ప్రతి ఆరునెలలకు ఒకసారి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులను జారీ చేస్తుంటుంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో విధించిన ఎస్మాను పొడిగించడానికి ఆరు నెలలకోసారి ఉత్వర్వులను ఇవ్వడం పరిపాలనలో ఒకభాగం. ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని కూడా ఎస్మా పరిధిలోకి తీసుకుని రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు.
పైగా లక్షలాది మంది భక్తుల సౌకర్యాలతో
లాక్డౌన్ వల్ల ఇప్పటికే నిధుల కొరతను ఎదుర్కొంటోంది టీటీడీ. ఆలయాన్ని భక్తుల కోసం తెరచిన తరువాత మళ్లీ ఉద్యోగులు సమ్మెలను చేయాల్సిన పరిస్థితి ఎదురైతే.. మరోసారి నిధుల కొరత ఖాయమౌతుంది. పైగా లక్షలాది మంది భక్తుల సౌకర్యాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల టీటీడీని ఎస్మా పరిధిలోకి తీసుకుని వచ్చినట్లు చెబుతున్నారు. ఆరు నెలల గడువు ముగిసిన తరువాత మరోసారి ఇవే ఉత్తర్వులను జారీ చేస్తుంది ప్రభుత్వం.