తిరుమలకు పోటెత్తిన భక్తజనం, దర్శనానికి 48గంటలు: కొండపైనే లక్షా 50వేల మంది భక్తులు
తిరుపతి: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది.శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది.

తిరుమలకు పోటెత్తిన భక్తులు: శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం
భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో వీఐపీలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టీటీడీ కోరింది.

తిరుమల కొండపైనే లక్షా50 వేల మంది భక్తులు
శనివారం నుంచి రెండు కిలోమీటర్లకుపైగా భక్తులు క్యూలైన్లో దర్శనం కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికే తిరుమల కొండపై దాదాపు 1.50 లక్షల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో వేచిచూస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవులు, శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

భక్తుల క్యూలైన్ల తనిఖీ
టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలో భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని ఈఓ తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు.

భక్తులు రావద్దని ఎప్పుడూ చెప్పలేదన్న టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఆదివారం తనను.కలసిన మీడియాతో చైర్మన్ మాట్లాడారు.
వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమల కు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమల కు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.