చంద్రబాబుకు తిరుపతి ఎమ్మెల్యే ఝలక్!...సీఎం తిరుమల పర్యటనకు గైర్హాజరు
తిరుపతిఎపి ముఖ్యమంత్రి,టిడిపి అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే ఊహించని షాక్ ఎదురైంది. సిఎం తిరుమల పర్యటనకు స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా తిరుమల అధికారుల వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుగుణమ్మ ఏకంగా ముఖ్యమంత్రి పర్యటనకు డుమ్మా కొట్టడం ద్వారా తన నిరసన తెలిపినట్లు భావిస్తున్నారు. శ్రీవారి బ్రహోత్సవాల సందర్భంగా వెంకటేశ్వరునికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సిఎం చంద్రబాబు పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ ఎక్కడా కనిపించలేదు. దీంతో చంద్రబాబు కూడా ఆమె గైర్హాజరుపై ఆరా తీసారని సమాచారం.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్, ఈవో, పలువురు అధికారులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత రాత్రి 7 గంటలకు శ్రీవారికి సిఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.
అయితే సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ఆద్యంతం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కనిపించలేదు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ...తిరుమలలో తనకు అధికారుల నుంచి కనీస గౌరవం కూడా దక్కడం లేదని, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆమె గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె గైర్హాజరుకు కారణం అలక వహించడమేనని భావిస్తున్నారు.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయ సంగ్రామానికి పార్టీ శ్రేణులను సమాయత్తం పరుస్తున్న కీలకమైన తరుణంలో ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేనే తన పర్యటనకు హాజరుకాకపోవడం అనేది చంద్రబాబుకు గట్టి షాకే నని చెప్పాలి. అందుకే ఈ విషయమై వెంటనే స్పందించిన సిఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ గైర్హాజరుపై ఆరాతీయడంతో పాటు ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రి అమరనాధ రెడ్డిని ఆదేశించారని తెలిసింది.