తిరుపతి:లడ్డూ కావాలా నాయనా...పిలిచి మరీ విక్రయాలు!
Recommended Video
తిరుపతి:తిరుపతి ఏడుకొండల స్వామి లడ్డూ కున్న డిమాండ్ అంతా ఇంతా కాదు...కేవలం శ్రీవారి భక్తులే కాదు మత విశ్వాసాలతో సంబంధం లేకుండా తిరుపతి లడ్డూను ఇష్టపడేవారు ఉన్నారు. అంతేకాదు కేవలం ఆ రుచి కోసమే తిరుపతి లడ్డూ తెప్పించుకోని తినే అన్య మతస్థులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
మరి అంత డిమాండ్ ఉంది కాబట్టే తిరుమల శ్రీవారి లడ్డూలు ఎంత భారీ సంఖ్యలో తయారు చేయించినా కొరత ఏర్పడుతూనే ఉండేది. దీంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్వామి వారు లడ్డూ లభ్యమవ్వాలనే ఆలోచనతో భక్తులకు అందచేసే శ్రీవారి లడ్డూలపై టిటిడి పరిమితి విధించింది. అయితే అలాంటి శ్రీవారి లడ్డూలను సోమవారం నుంచి రండి బాబూ రండి...లడ్డూలు తీసుకోండి...అంటూ పిలిచి మరీ విక్రయిస్తున్నారు.
దీనికి కారణమేమంటే మహా సంప్రోక్షణం సందర్భంగా భక్తుల రాకపోకలపై ఆంక్షలే...మహాసంప్రోక్షణ ఎఫెక్ట్తో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే భక్తుల రాక ఒక్కసారిగా ఇంత కనిష్టానికి పడిపోతుందని ఊహించని టీటీడీ స్వామి వారి ప్రసాదాలు రూ.100 వడ, రూ.50, రూ.200 కల్యాణం లడ్డూలు భారీ గానే నిల్వ చేసుకుంది.
అయితే తాము ఊహించినదానికంటే భక్తులు మరీ తక్కువగా వస్తుండటంతో స్వామి వారి లడ్డూలన్నీ మిగిలిపోయాయి. దీంతో ఈ విషయం గమనించిన టిటిడి అధికారులు స్వామిని దర్శించుకుని వగపడి ప్రాంతానికి చేరుకునే భక్తులకు లడ్డూలను విక్రయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా వగపడిలో స్వామివారి ప్రసాదాలు లడ్డూలు గాని, వడ పొందాలంటే అధికారుల నుంచి సిఫార్సు లేఖలు ఉండాల్సిందే.
అయితే సోమవారం మాత్రం భక్తుల వద్ద ఎలాంటి సిఫార్సు లేకపోయినా లడ్డూలు, వడలు విక్రయించారు. అంతేకాదు కౌంటరు లోపలే కాకుండా బయట కూడా లడ్డూ వడల ట్రేలను ముందుపెట్టుకుని భక్తులను పిలిచి మరీ విక్రయించారు. గతంలో ఎప్పుడు తిరుమల వచ్చినా స్వామి వారి లడ్డూలు పొందాలంటే సిఫార్సులో లేక కుటుంబ సభ్యులు ఎక్కువమంది లైన్లలో గంటల తరబడి నిల్చొని వాటిని కొనుగోలు చేయాల్సి వచ్చేదని భక్తులు గుర్తుచేసుకున్నారు.
అలాంటిది సోమవారం స్వామిని దర్శించుకున్న తమను పలిచి మరీ అడిగినన్ని లడ్డూలు ఇచ్చారని, అలాగే కల్యాణోత్సవం లడ్డూలు సైతం కోరినన్ని ఇచ్చారని ఇది చెప్పలేనంత సంతోషం కలుగచేసిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.