నేడే తిరుపతి,నాగార్జున సాగర్ ఉపఎన్నికలు... అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓటర్లు...
ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి,తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి శనివారం(ఏప్రిల్ 17) ఉపఎన్నిక జరగనుంది. పోలింగ్కి సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోవిడ్ పేషెంట్లకు చివరి గంటలో ఓటేసే అవకాశం కల్పించనున్నారు. పూర్తిగా కరోనా జాగ్రత్తలతో పోలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక
తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.ఉపఎన్నికలో మొత్తం 28మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన వైసీపీ తరుపున డా.గురుమూర్తి,బీజేపీ తరుపున రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ,టీడీపీ తరుపున వనబాక లక్ష్మి,కాంగ్రెస్ తరుపున చింతా మోహన్ పోటీ చేస్తున్నారు. మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఈ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ తెలిపారు.
ఉపఎన్నికకు గట్టి భద్రత...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. దినేష్ పాటిల్ సాధారణ అబ్జర్వర్గా, రాజీవ్కుమార్ పోలీసు అబ్జర్వర్గా, ఆనందకుమార్ ఎన్నికల వ్యయ అబ్జర్వర్గా విధులు నిర్వర్తించనున్నారు. అలాగే మరో 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల సంఘం నియమించింది.
సాగర్లో పరిస్థితి ఇదీ..
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ తరుపున నోముల భగత్,కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత కుందూరు జానారెడ్డి,బీజేపీ తరుపున రవి నాయక్ పోటీ చేస్తున్నారు. మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉండగా... ఇందులో పురుష ఓటర్లు 1,09,228, మహిళ ఓటర్లు 1,11,072 మంది ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 3145 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2390 మంది పోలీస్ బలగాలను మోహరించారు.