బీజేపీకి పవన్ షాకిస్తారా? సరెండరా? తిరుపతి ఉప ఎన్నికపై 21న కీలక నిర్ణయం -వకీల్ సాబ్ దూకుడు చూస్తే
ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బై పోల్ కోసం నెలల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ, టీడీపీలు తమవైన వ్యూహాలతో ముందుకు పోతున్నాయి. రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే బీజేపీ.. దాని మిత్ర పార్టీ జనసేనలు మాత్రం తిరుపతితో పోటీపై తగువులాడుకుంటున్నాయి. ఈ విషయమై కాషాయ పార్టీ హైకమాండ్ పట్ల గుర్రుగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇంకాస్త దూకుడు ప్రదర్శించారు. బీజేపీతో టికెట్ పంచాయితీ తేలకముందే తిరుపతి బాటపట్టారు..
Recommended Video
మోదీ సాబ్.. మా బాకీ ఇప్పించండి -ఇబ్బందుల్లో ఉన్నాం -కేంద్రానికి హైదరాబాద్ నిజాం మనవడి విజ్ఞప్తి
బండి దూకుడులో కొంచెమైనా?
ఏపీలో గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన బీజేపీ.. తిరుపతి బైపోల్ ను ఒక మైలురాయిగా భావిస్తోంది. హోదా ఇవ్వని పార్టీ అనే ముద్రను తొలగించుకుని, హిందువులకు ప్రతినిధిననే ఎత్తుగడతో రాజకీయాలు చేయాలనుకుంటోంది. తిరుపతిలో ఏ మేరకు ప్రభావం చూపుతామనే అంశంపైనే ఏపీలో తమ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని బీజేపీ యోచిస్తోంది. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ తమ పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటోంది. బండి సంజయ్ దూకుడును కొంతైనా అందిపుచ్చుకుని జగన్ పై పోరును ముమ్మరం చేయడం ద్వారా తిరుపతిలో సత్తా చాటుకోవచ్చని, ఇందుకు జనసేన బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..
కాపు ఓట్లు.. చిరు సెంటిమెంట్..
తిరుపతి బైపోల్ ను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో.. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అంతకంటే ఎక్కువనే ఫీలవుతున్నారు. తన కాపు సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉండటం, గతంలో అన్నయ్య చిరంజీవి గెలుపొందిన స్థానం కావడం తదితర కారణాలతో పవన్ తిరుపతిని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఉమ్మడి అభ్యర్థిపై బీజేపీ ఏకపక్ష ప్రకటన తర్వాత పవన్ గుర్రుగా ఉన్నారని, అందుకే తన విలువేంటో బీజేపీ స్థానిక నేతలకు తెలిసొచ్చేలా పవన్ వ్యూహాలు రచించారు. అందులో భాగంగా నేరుగా కార్యక్షేత్రంలోకి దిగిపోనున్నారు జనసేనాని..
21న తిరుపతికి పవన్
లోక్ సభ ఉప ఎన్నిక వేడి పెరిగిన నేపథ్యంలో ఈ నెల 21న పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ జరిగే జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో జనసేనాని పాల్గొననున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక అంశంపై ఈ సమావేశంలో జనసేన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామనే విషయాన్ని గుర్తు చేస్తున్న జనసేన నేతలు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు ఇవ్వాలని బీజేపీని బలంగా, గట్టిగానే ఒత్తిడి చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తిరుపతి బైపోల్ లో జనసేన పోటీకి సంబంధించి పొలిటికల్ అఫైర్స్ భేటీలో తీర్మానం చేయబోతున్నారని కూడా వినికిడి. దీంతో..
బీజేపీతో శరణమా? రణమా?
ఏపీలో తమ బలం ఎంతవరకు ఉందనే దానిపై అధికార వైసీపీకి తెలియజేయాలనే యోచనలో ఉన్న జనసేన.. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే జనసేన తరపున తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల 21న తిరుపతి పర్యటనకు సిద్దమైన పవన్ కళ్యాణ్.. జనసేన అభ్యర్థి తిరుపతి బరిలో ఉంటారని ప్రకటించి బీజేపీకి షాక్ ఇస్తారా ? లేక ఇక్కడ పోటీ చేసే అవకాశాన్ని బీజేపీకి ఇస్తారా ? అన్నది చూడాలి.
అమ్మాయిలు 15 ఏళ్లకే పిల్లల్ని కనగలరు -పెళ్లి వయసు పెంచొద్దు -కాంగ్రెస్ నేత వికృతం - NCPCR ఫైర్