సమాధి వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, ఉద్రిక్తత
హైదరాబాద్: తిరుపతిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తిరుపతి దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధిని తిరుపతి కపిలతీర్ధం వద్ద ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు పిలుపునిచ్చారు. భక్తులు వెళ్లే మార్గంలో సమాధి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ నేత, ఉపఎన్నికలో ఓటమిపాలైన శ్రీదేవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమాధి వద్దకు భారీగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. కపిలతీర్ధం వద్ద ఏర్పాటు చేసిన దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సమాధిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమాధి వద్దకు చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను తరిమేశారు.
ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మరణించడంతో తిరుపతిలో ఉపఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన వెంకటరమణ సతీమణి సుగుణమ్మ లక్షా పదహారు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవిపై గెలిపొందారు.