దళారులకు పండగే! టీటీడీలో వీఐపీల కట్టడి ఉత్తిదేనా? కొత్తది తీసి పాత విధానం తెస్తారా?
తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వెలసిన శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అయోమయానికి గురి చేసే విధానాలకు పూనుకుంటోంంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు యాజమాన్యం. స్వామివారి దర్శనం కోసం భక్తులు కొనుగోలు చేసే టికెట్ల జారీ వ్యవస్థలో మార్పులు చేస్తామంటూ టీటీడీ చేసిన తాజా ప్రకటన భక్తులను గందరగోళంలో పడేసేలా చేస్తోంది. టికెట్ల జారీ వ్యవస్థలో దళారుల ప్రమేయానికి జోక్యం కల్పించినట్టవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ విమానానికి తప్పిన ముప్పు: రేణిగుంటలో అత్యవసర ల్యాండింగ్!
ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండానే రద్దు చేస్తే..ఎట్టా?
వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త తరహా దర్శన వ్యవస్థను ప్రవేశపెడతామని దేవస్థానం బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం చూస్తే- వీఐపీ బ్రేక్ పేరిట ప్రస్తుతం అమలు చేస్తున్న ఎల్-1, ఎల్-2, ఎల్-3 దర్శనాలను రద్దు అవుతాయి. దీని స్థానంలో ఎలాంటి వ్యవస్థను ప్రవేశపెడతారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవు. కొత్తగా ఏదైనా అమలు చేయాల్సి వస్తే- గత వ్యవస్థలను పునరుద్ధరించాల్సి వస్తుందే తప్ప మరో మార్గం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాల్సి వస్తే- దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని వ్యవస్థలను పరిశీలిస్తోంది యాజమాన్యం.
అర్చనానంత దర్శనం..
ప్రస్తుతం టీటీడీ యాజమాన్యం పరిశీలనలో ఉన్న వ్యవస్థ అర్చనానంతర దర్శనం. ఇది పాతదే. ఓ దశాబ్దకాలం కిందటే ఈ వ్యవస్థ అమల్లో ఉంది. అర్చనానంతరంతో పాటు, సెల్లార్ దర్శనం ఇదివరకు అమల్లో ఉన్నవే. వాటినే పునఃప్రవేశపెట్టాలనే అంశాన్ని టీటీడీ పాలక మండలి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ కింద ప్రతిరోజూ 200 రూపాయల విలువ చేసే అర్చనానంతర దర్శనం టికెట్లు 10 వేల నుంచి 15 వేల వరకు జారీ చేసే వారు. అలాగే- 100 రూపాయల ధర గల సెల్లార్ టికెట్లను అయిదు వేల నుంచి 10 వేల వరకు విక్రయించేవారు. ఇందులో టీటీడీ అధికారుల కోటా కూడా ఉండేది. సాధారణ టికెట్ల విషయాన్ని పక్కన పెడితే- ఈ కోటా కింద జారీ చేసే టికెట్లు దళారుల చేతికి చిక్కేవి.
దళారీ వ్యవస్థకు ప్రాణం పోసినట్టే!
ఫలితంగా- ఆయా టికెట్ల రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచుకుని, భక్తులకు విక్రయించే వారు కొందరు దళారులు. టికెట్ల జారీలో దళారీ వ్యవస్థ మితిమీరినందున- దీన్ని రద్దు చేశారు. వాటి స్థానంలో శీఘ్రదర్శనం విధానాన్ని అమలు చేశారు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తే- మరోసారి దళారి వ్యవస్థకు ప్రాణం పోసినట్టవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. 200 రూపాయలకు లభించాల్సిన అర్చనానంతర దర్శనం టికెట్లు ఇక 2000 రూపాయలకు కూడా దొరికే అవకాశం దక్కకపోవచ్చని అంటున్నారు. సామాన్య భక్తుల సౌకర్యం కోసం 100 రూపాయల ధర గల టికెట్లను జారీ చేసే విధానాన్ని ప్రవేశపెడితే దాన్ని కూడా దళారులు తమ ఇష్టానుసారంగా అమ్ముకుంటారని అంటున్నారు.