వైఎస్ ఫ్యామిలీపై చింతామోహన్ షాకింగ్- జగన్ వీక్ సీఎం- షర్మిల పిల్ల చేష్టలు- టీటీడీ ధారాదత్తం
ఏపీలో గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తిరుపతి ఎంపీగా పనిచేసి కొంతకాలంగా సైలెంట్గా ఉన్న చింతా మోహన్ ఇవాళ వైఎస్ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అప్పట్లో వైఎస్, ఆ తర్వాత జగన్ కాంగ్రెస్ను ఎలా దెబ్బతీశారో ఆయన ఉదాహరణలతో సహా వివరించారు. విశాఖ స్టీల్ తరహాలోనే టీటీడీ ఆస్తులను కూడా ధారాదత్తం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందన్నారు. రాజన్నరాజ్యం పేరుతో జగన్, షర్మిల చేస్తున్న రాజకీయాలను పిల్ల చేష్టలుగా ఆయన అభివర్ణించారు. జగన్ అంత బలహీన ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు.
వైఎస్ కుటుంబంపై చింతామోహన్ షాకింగ్ కామెంట్స్
ఎప్పుడూ కూల్గా కనిపించే తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఇవాళ ఒక్కసారిగా వైఎస్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. మాజీ సీఎం వైఎస్తో పాటు ఆయన పిల్లలు జగన్, షర్మిలపై సైతం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ కుటుంబం ఉన్నత స్ధాయికి వచ్చిందని చింతామోహన్ తెలిపారు.
అయినా కాంగ్రెస్ పార్టీని వైఎస్ కుటుంబీకులు దారుణంగా దెబ్బ తీశారని చింతా షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ను రెండుసార్లు సీఎం, పీసీసీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్ పునాదులను ఆయన తొలగించారని, ఏ నేత చేయని విధంగా తన సొంత పలుకుబడిని పెంచుకుని, తన ఇద్దరు బిడ్డలు వేల కోట్లు సంపాదించుకునేలా ఆర్ధిక వనరులు సృష్టించారని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ రెడ్లను దెబ్బతీసిన వైస్సార్, జగన్
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా అవకాశం కల్పిస్తే వైఎస్ మాత్రం అదే పార్టీలోని రెడ్డి నేతలు జేసీ దివాకర్రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలను రాజకీయంగా దెబ్బతీశారని చింతామోహన్ మరో షాకింగ్ కామెంట్ చేశారు. అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్ వీరిని రాజకీయంగా దెబ్బతీశారని చింతామోహన్ ఆరోపణలు చేశారు. గతంలో కాంగ్రెస్ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను వైఎస్ రాజశేఖర్రెడ్డి తన సొంత పథకాలుగా చిత్రీకరించారని చింతా మోహన్ ఆరోపించారు.
రాజన్నరాజ్యం పేరుతో జగన్, షర్మిల పిల్ల చేష్టలు
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉండి సొంత పలుకుబడి పెంచుకుంటే, ఆయన తర్వాత పిల్లలు జగన్, షర్మిల రాజన్న రాజ్యం తెస్తామంటూ రాజకీయాలు చేయడంపైనా చింతా మోహన్ మండిపడ్డారు. తండ్రి సృష్టించిన ఆర్ధిక వనరులను వాడుకుంటూ ఇప్పుడు రాజన్న రాజ్యం పేరుతో జగన్, షర్మిల చేస్తున్న హడావిడి పిల్ల చేష్టలుగా కనిపిస్తోందని చింతా విమర్శించారు. గతంలో వైసీపీ అధినేతగా జగన్ రాజన్నరాజ్యం తెస్తామంటూ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు షర్మిల రాజన్నరాజ్యం తెస్తానంటూ తెలంగాణలో హడావిడి చేస్తున్నారని చింతా విమర్శించారు.
జగన్ పాలనలో ఆకాశానికి అవినీతి
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాలపైనా చింతా మోహన్ స్పందించారు. ముఖ్యంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా రాష్ట్రంలో అవినీతి జరుగుతున్న పలు అంశాలను చింతా ప్రస్తావించారు. జగన్ పాలనతో అవినీతి ఆకాశమంత ఎత్తుకు లేచిందని, ప్రతీ ఫైల్కూ పైసలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మైనింగ్, ఇసుక, మద్యం వ్యాపారాల్లో వందల కోట్లు దండుకుంటున్నారని చింతా మోహన్ విమర్శించారు. దీంతో చింతామోహన్ విమర్శలు ప్రాదాన్యం సంతరించుకున్నాయి.
టీటీడీ ఆస్తులపై బీజేపీ, ఆరెస్సెస్ కన్ను
టీడీడీ ఆధీనంలోని రూ.10 వేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల బంగారు అభరణాలు, లక్ష కోట్ల ఆస్తులపై బీజేపీ, ఆరెస్సెస్ కన్నేశాయని చింతామోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 7న ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన ఈ వ్యవహరంపై రహస్య సమావేశం కూడా జరిగిందని, దీనిపై వారు న్యాయ సలహా కూడా తీసుకున్నట్లు తెలిసిందని చింతామోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు తరహాలో టీడీడీని కూడా ధారాదత్తం చేయాలని కుట్రలు పన్నుతున్నారని కూడా చింతా ఆరోపించారు.
జగన్ ఎంత బలహీన ముఖ్యమంత్రి అంటే..
జగన్ బలహీనత వల్లే రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు పలు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. ఈ వ్యవహారాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.రాబోయే ప్రమాదాన్ని గుర్తించి అందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు టీటీడీ ధారాదత్తం వ్యవహారాల్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు.