తిరుపతిలో వెయ్యికోట్లతో టాటా క్యాన్సర్ ఆస్పత్రి: చంద్రబాబు, రతన్ టాటా భూమిపూజ
Recommended Video
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అత్యాధునిక వైద్యశాల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. తిరుపతి వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటాతో కలిసి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.
వెయ్యికోట్లతో..
వెంకటేశ్వర జంతు ప్రదర్శన శాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది. టీటీడీ కేటాయించిన 25ఎకరాల స్థలంలో రూ.1000కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. మొత్తం వెయ్యి పడకలకు గానూ తొలి దశలో 376 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.
టాటా క్యాన్సర్ ఆస్పత్రి..
ఈ ఆస్పత్రి ద్వారా రోగులకు క్యాన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా క్యాన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, టీడీపీ నేతలు, టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ హాజరయ్యారు.
టాటాకు బాబు కృతజ్ఞతలు
క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు చొరవ చూపిన టాటా ట్రస్ట్కు చంద్రబాబు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందన్నారు. 124 ఆస్పత్రులు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని సీఎం తెలిపారు. తిరుపతి ఆస్పత్రి రేడియేషన్ థెరపీకి హబ్గా మారుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. రోగుల బంధువుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వారసత్వ క్యాన్సర్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అన్ని జిల్లాల్లోనూ..
ఈ ఆస్పత్రి ఏర్పాటుతో క్యాన్సర్ను 75 శాతం ముందే గుర్తించవచ్చునని చంద్రబాబు అన్నారు. చివరి దశలో గుర్తించడం వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని, క్యాన్సర్పై అవగాహన చాలా ముఖ్యమన్నారు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ను నివారించవచ్చునని చంద్రబాబు అన్నారు. తిరుపతి అనేక రంగాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని, తిరుపతిని మెడికల్ హబ్గా తయారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.