నాటి కడప ఓటమికి ప్రతీకారం ఇలా : కుప్పంలో వైసీపీ జెండా ఎగరాల్సిందే: మంత్రి..ఎంపీకి బాధ్యతలు..!
టార్గెట్ చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక మార్గాల్లో ఇదే లక్ష్యంతో పని చేస్తోంది. 2019 ఎన్నికల్లోనూ టీడీపీని 23 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం చేయటంలో వైసీపీ సక్సెస్ అయింది. ఇక, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పైన వైసీపీ ప్రత్యేకంగా వ్యూహాలు సిద్దం చేస్తోంది.
టార్గెట్ కుప్పం
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైయస్ వివేకా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి గెలిచారు. ఇప్పుడు దీనికి ప్రతిగా..చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఉంది. అందు కోసం ప్రత్యేకించి కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఎంపీ రెడ్డప్పకు అప్పగించారు. వారిద్దరూ ఇప్పటికే కుప్పం పరిధిలోని జెడ్పీటీసీలు.. ఎంపీటీసీల పైన అభ్యర్ధుల మొదలు గెలుపు వరకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తన నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అమలు చేస్తున్న వ్యూహాలను గమనిస్తూ..కౌంటర్ దాడి మొదలు పెట్టారు. దీంతో..ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు కుప్పం హాట్ టాపిక్ గా మారింది.
వివేకాను ఓడించారు..ఇప్పుడు కుప్పంలో
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ సీటును టీడీపీ గెలిచింది. జగన్ కు కంచుకోట అయిన కడప జిల్లాలో 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జిల్లా పరిషత్ లో విజయం సాధించింది. అయితే, స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి వైయస్ వివేకా పోటీ చేయగా..టీడీపీ నుండి బీటెక్ రవి పోటీ చేసారు. అయితే, టీడీపీ అధికారంలో ఉండటంతో స్థానిక సంస్థ ల్లో వైసీపీకి మెజార్టీ ఉన్నా..ఎమ్మెల్సీ స్థానం మాత్రం టీడీపీ అభ్యర్ది గెలుచుకున్నారు. జగన్ తన సొంత బాబాయ్ ను గెలిపించులేకపోయారంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. ఇక, ఇప్పుడు వైసీపీ చేతిలో అధికారం ఉంది. దీంతో..నాడు తన సొంత జిల్లాలో సొంత బాబాయ్ ను గెలిపించుకోలేక పోయిన జగన్..ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాగైనా చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో వైసీపీ జెండా ఎగరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన పసి గట్టిన పార్టీ కో ఆర్డినేటర్లు చిత్తూరు జిల్లా నేతలకు కుప్పం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ధేశించారు.
మంత్రి..ఎంపీకీ కుప్పం గెలుపు బాధ్యతలు..
చిత్తూరు జిల్లా మంత్రి..చంద్రబాబు చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పరిస్థితి పైన ప్రతీ క్షణం వాకబు చేస్తున్నారు. ఆయనతో పాటుగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సైతం కుప్పం పైనే ఫోకస్ చేసారు. రెడ్డప్పకే స్థానిక సంస్థల ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం ఎంపీపీ..జడ్పీటీసీ రిజర్వేషన్లను మార్చినట్లు సమాచారం. 1989లో తొలి సారి చంద్రబాబు కుప్పం నుండి గెలుపొందారు. ఆ సమయంలో గుడుపల్లె మండలంలో భారీ మెజార్టీ వచ్చింది. అప్పటి నుండి ఆ మండలం చంద్రబాబుకు ప్రతీ సారి మెజార్టీ అందిస్తూనే ఉంది. దీంతో..ఈ సారి ఆ మండలం పైనే వైసీపీ నేతలు ఫోకస్ చేసారు.
Recommended Video
అక్కడ మెజార్టీ తగ్గితేనే...
గుండుపల్లెలో మెజార్టీ తగ్గిస్తే కుప్పంలో వైసీపీ గెలుపు కష్టం కాదనే అంచనాతో ఉన్నారు. దీంతో..ఎంపీ రెడ్డప్ప పూర్తిగా కుప్పం లో టీడీపీ నుండి బరిలో దిగుతున్న అభ్యర్ధులు..గ్రామాల వారీగా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి..అధిష్ఠానంకు అందిస్తున్నారు. ఇక్కడ గెలుపు మంత్రి పెద్దిరెడ్డితో పాటుగా ఎంపీకీ కీలకంగా మారుతోంది. అయితే, సుదీర్ఘ కాలంగా ఆ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న చంద్రబాబు వైసీపీ నేతల ఎత్తుగడలను పరిశీలిస్తున్నారు. కౌంటర్ గేమ్ ప్రారంభించారు. దీంతో..కుప్పం లో చివరి ఫలితం పైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది.