టైటానియం స్కామ్: హైకోర్టులో కెవిపికి తాత్కాలిక ఊరట
హైదరాబాద్: టైటానియం స్కామ్ కేసులో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుకు తాత్కాలిక ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో తక్షణ అరెస్టు నుంచి కెవిపి రామచందర్ రావుకు ఊరట లభించినట్లే.
కెవిపిపై జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసుపై సోమవారం విచారణ జరిగింది. ఈ నోటీసును సిఐడి రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. కెవిపిపై అరెస్టు వారంట్ కోసం వేచి చూస్తున్నామని సిఐడి తెలిపింది. సిబిఐ డైరెక్టర్కు, కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కెవిపి రామచంద్రరావుపై సిబిఐ నుంచి రెడ్కార్నర్ నోటీసు అందిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ప్రసాదరావు ఆదివారంనాడు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ప్రొవిజనల్ అరెస్టు వారెంట్ రాలేదని ఆయన అన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీతో తనకు అరెస్టు భయం ఉందని తెలుపుతూ కెవిపి రామచందర్ రావు హైకోర్టుకు వెళ్లారు.
వారెంట్స్పై సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కెవిపి పార్లమెంట్ సభ్యుడు అయినందున నిఘా పెట్టలేదని ప్రసాదరావు తెలిపారు. టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్పోల్ కెవిపికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై అమెరికాలోని చికాగోలో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో టైటానియం ఉత్పత్తులకు అవసరమైన ఖనిజాన్ని వెలికితీసి, అంతర్జాతీయ స్థాయిలో విక్రయించి, కోట్లు మూటగట్టుకునేందుకు ప్రయత్నం చేసినట్లు, ఇందులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో 1.85 కోట్ల డాలర్లు (మన లెక్కలో చెప్పాలంటే 110.81 కోట్ల రూపాయలు) లంచాలుగా ఇచ్చేందుకు కుట్ర పన్నారని తేలింది. ఇందులో సుమారు 64 కోట్ల సొమ్ము బట్వాడా అయినట్లు సమాచారం.