ఏపీలోనూ ఈఎస్ఐ స్కాం ప్రకంపనలు: అచ్చెన్న..పితాని లక్ష్యంగా..!! వైసీపీ ప్రభుత్వం వదిలేనా..!
తెలంగాణలో సంచలనం కలిగించిన ఈఎస్ఐ స్కాం ప్రకంపనలు ఇప్పుడు ఏపీలోనూ మొదలయ్యాయి. ప్రభుత్వం అత్యంత రహస్యంగా విజిలెన్స్ తో ఈఎస్ఐ స్కాం ఏపీలోనూ జరిగిందా అనే కోణంలో విచారణ చేయిస్తోంది. ఆ ససమయంలో దిమ్మతిరిగే అక్రమాలు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే..ఎక్కడా విషయం బయటకు పొక్కకుండా ఆధారాల కోసం అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ స్కాంలో టీడీపీ హాయంలో పని చేసిన ఇద్దరు మంత్రుల ప్రమేయం పైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గత అయిదు రోజులు ఈఎస్ఐ స్కాంకు సంబంధించి డైరెక్టరేట్ తో పాటుగా ఆస్పత్రులు.. డిస్పె న్సరీలు..డయాగ్నస్టిక్ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు రూ 300 కోట్లుకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. దీంతో..ఆ సమయంలో పని చేసిన అధికారులతో పాటుగా రాజకీయ సంబంధాల పైన విచారణలో ప్రధానంగా ఫోకస్ చేసినట్లు సమాచారం.సరైన ఆధారాలు ఉంటే మాజీ మంత్రుల పైన చర్చలకు వెనుకాడేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
అచ్చెన్న..పితానీ ప్రమేయం ఉందా..!
ఈ వ్యవహారం మొత్తం అధికారుల స్థాయిలోనే జరిగిందా..లేక మంత్రుల సహకారం కూడా ఉందే అనే కోణంలో ప్రధానంగా విచారణ సాగుతోంది. టీడీపీ హాయంలో కార్మిక శాఖ మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు..పితాని సత్యనారాయణ కు దీనితో ఏదైనా ప్రమేయం ఉందా అని ఆరా తీస్తున్నారు.
అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో టెలీహెల్త్ సర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందా రాసిన లేఖ దొరికినట్లు చెబుతున్నారు. మంత్రి ఆదేశాల మేరకే తాము ఒప్పందం చేసుకున్నామని నాటి అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, 2017 నుండి ఇప్పటి వరకు ఈ సంస్థ దాదాపు రూ 10 కోట్ల మేర బిల్లులు పెట్టినట్లు సమాచారం. దీంతో పాటుగా ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో పరీక్షల విషన్ల పేరుతో బయట ధరల కన్నా ఎక్కవ రేటు వసూల చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి వద్ద పని చేసిన ఓఎస్డీ పాత్ర మీద పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
సిబ్బంది వేతానాల్లోనూ గోల్ మాల్..
టెలికాల్ హెల్త్ సెంటర్లలో పని చేసే సిబ్బంది వేతనాల విషయంలోనూ గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. వారికి చెల్లించే వేతనాల కంటే ఎక్కువ మొత్తంలో బిల్లులు డ్రా చేసినట్లుగా తేలింది. ఇక, అచ్చెన్నాయుడు తరువాత కార్మిక మంత్రిగా పని చేసిన పితాని సత్యనారాయణ సైతం గత నిర్ణయాలను పరిశీలించకుండానే కొనసాగింనట్లు అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే భారీ ఎత్తున మందులకు ఆర్డర్లు ఇచ్చారని తేల్చారు.
అందులో మందుల కంపెనీలకు ఆర్డర్లు ఇప్పించటంతో పితాని తనయుడి పాత్ర పైన విచారణ మొదలైంది. పితాని మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద పని చేసిన వ్యక్తిగత కార్యదర్శి పాత్ర కూడా ఉందని విచారణ అధికారులు చెబుతున్నారు. దీని పైన పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
ఏపీలో 60 శాతం లావాదేవీలు చేసిన ఓమ్నీమెడీ..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈఎస్ఐ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓమ్నీ మెడీసంస్థ ఏపీలో సైతం 60 శాతం లావాదేవీలు నిర్వహించినట్లుగా విచారణాధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా ఆ సంస్థకు పెద్ద మొత్తంలో నిధులు చెల్లించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ సంస్థకు సహకరించిన రాజకీయ నేతలు..అధికారులు..దళారుల పాత్ర పైన పూర్తి సమాచారం సేకరించిన తరువాత ప్రభత్వం దీని పైన ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇదే వ్యవహారం పెద్ద ఎత్తున మందుల టెండర్లు దక్కించుకున్న ఫార్మా కంపెనీలకు సహకరించిన వారు..వారికి తోడ్పాటు అందిచింన వారి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే ఈ మొత్తం వ్యవహారాలను బయట పెట్టేందుకు రంగం సిద్దం అవుతోంది.
వైసీపీ ప్రభుత్వం వదిలేనా..
ప్రస్తుతం సాగుతున్న విచారణలో అచ్చెన్నాయుడు ప్రమేయం పైన ఏ మాత్రం ఆధారాలు దొరికినా..ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పూర్తి సమాచారం..ఆధారాలు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నా ప్రతిపక్షం కక్ష్య సాధింపు చర్యలుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. దీంతో..ఏ మాత్రం ఆధారం దొరికినా అచ్చెన్నను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రచారం సాగుతోంది.