పంజా విసురుతున్న టిట్లీ తుపాను...ఐదుగురు విశాఖ మత్స్యకారుల గల్లంతు
విశాఖపట్టణం:టిట్లీ తుపాను ఒడిశా,ఉత్తరాంధ్రలపై విరుచుకుపడుతోంది. గంటకు 165 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదులు గాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గోపాల్ పూర్ సముద్రతీర ప్రాంతంలో విశాఖకు చెందిన 5 మత్స్యకార బోట్లు తుపానులో చిక్కుకోగా...చివరకు వీటిలో 4 అతికష్టం మీద ఒడ్డుకు చేరుకోగా ఒక బోటు గల్లంతైంది. ఈ గల్లంతైన బోట్ లో విశాఖకు చెందిన 5గురు మత్స్యకారులు ఉన్నట్లు ఒడ్డుకు చేరిన బోట్లలోని మత్స్యకారులు తెలిపారు. ఒకవైపు ఒడిషా ఐదు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించగా...మరోవైపు ఉత్తరాంధ్రకు సంబంధించి ఎపి సిఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
టిట్లీ తుఫాన్ తాకిడికి గురైన ఒడిషాలోని గోపాల్ పూర్, బరంపూర్ లలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రహదారులు పూర్తిగా జలమయం కావడంతో రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 3 లక్షల మందిని సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఇదిలావుంటే గోపాల్ పూర్ సముద్ర తీర ప్రాంతంలో విశాఖకు చెందిన 5 మత్స్యకార బోట్లు పెను తుపానులో చిక్కుకున్నాయి. ఈదురు గాలుల ధాటికి ఒక బోటు కోట్టుకుపోగా మిగిలిన నాలుగు బోట్లు అతికష్టం మీద ఓడ్డుకు చేరుకున్నాయి. గల్లంతైన బోటులో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారని ఒడ్డుకు చేరిన మత్స్యకారులు తెలిపారు. దీంతో గల్లంతైన బోటులోని మత్స్యకారుల ఆచూకీ కోసం కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు. మత్స్యకారులు గల్లంతైన సమాచారం విశాఖ హార్బర్ కు కూడా అందినట్లు తెలుస్తోంది.
అలాగే శ్రీకాకుళం జిల్లాలో టిట్లీ తుపాను తాకిడి కారణంగా చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. తుఫాను ధాటికి జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వంగర మండలం ఓనిఅగ్రహారంలో చెట్టు విరిగిపడి అప్పలనరసమ్మ(62) అనే మహిళ మృతి చెందగా, సరుబుజ్జిలి మండలంలో ఇల్లు కూలిపోయి సూర్యారావు(55) మృతి చెందాడు.