అశోక్బాబువి బలుపు మాటలు, ఎగిసిపడ్తాం: దేవీప్రసాద్
సీమాంధ్ర పెట్టుబడిదారులకు ప్రతీకగా ఉన్న అశోక్బాబు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కష్టజీవుల చెమటతో నిర్మించారని, సీమాంద్రులు వ్యాపారం కోసం వచ్చి, పన్నులు చెల్లించినంత మాత్రాన మాది అనడం సరికాదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా తెలంగాణ ఉద్యోగులు క్రీయాశీల పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
తెలంగాణపై యూ టర్న్ తీసుకున్న పార్టీలను అడ్డుకొని ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీమాంధ్ర జిల్లాల్లో సమ్మెపేరుతో కేవలం ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే స్తంభించాయన్నారు. ఈ విషయాన్ని స్వయంగా దిగ్విజయ్ సింగ్ చెప్పినా, మీడియా ప్రాధాన్యం కల్పించకపోవడం శోచనీయమన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర కాంగ్రెస్, లోక్సత్తా పార్టీలు తెలంగాణ వ్యతిరేక డీఎన్ఏలు అని వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ తెలంగాణలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తే మరో మానుకోట సంఘటన పురావృతమవుతుందని హెచ్చరించారు.
కిరణ్కుమార్ రెడ్డి సీమాంద్రులకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నాడని ఉద్యోగ సంఘాల జెఎసి నాయకుడు శ్రీనివాస గౌడ్ మండిపడ్డారు. కిరణ్, చంద్రబాబు, జగన్ కలిసి ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుతో సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తూ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా కుట్రలు పన్నుతున్నారని ఆయన గురువారం నిజామాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.