అనంతపురంలో కన్నాకు టిఎన్ఎస్ఎఫ్ నిరసన సెగ:టిడిపి,బీజేపీ నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత
అనంతపురం: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం పర్యటన సందర్భంగా ఆయన బస చేసిన ఆర్అండ్బి గెస్ట్హౌస్ వద్ద టిడిపి అనుబంధ విద్యార్థి సంస్థ టిఎన్ఎస్ఎఫ్ నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
కన్నా బస చేసిన గెస్ట్ హౌస్ వద్దకు టిఎన్ఎస్ఎఫ్ నేతలతో పాటు కొందరు టిడిపి నేతలు కూడా చేరుకొని బిజెపికి, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు లోనికి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని బిజెపి నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో గెస్ట్ హౌస్ తలుపులు కూడా ధ్వంసం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఎపి బిజెపి అద్యక్షుడిగా పదవి చేపట్టాక వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఇదే క్రమంలో అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఆర్అండ్బి గెస్ట్హౌస్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అయితే అనంతపురంకు కన్నా రాక తెలిసి నిరసన తెలిపేందుకు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు , మరి కొందరు టీడీపీ కార్యకర్తలు గెస్ట్హౌస్ చేరుకుని కన్నాకు, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రెస్ మీట్ జరిగే ప్రదేశం వద్దకు దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటంతో టిఎన్ఎస్ఎఫ్, టిడిపి నేతలను అక్కడనుంచి తరుముతూ దాడిచేశారు. అనంతరం సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కండువాలకు బీజేపీ నేతలు నిప్పుపెట్టారు. ఇరువర్గాల మధ్య దాడుల గురించి తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసు బలాగాలు తరలివచ్చి రెండు వర్గాల నేతలను దూరం దూరంగా చెదరగొట్టారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉండటంతో పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవలే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల పర్యటన సందర్భంగా ఇటువంటి పరిస్థితే చోటుచేసుకోగా మళ్లీ తాజాగా ఎపి బిజెపి అధ్యక్షుడి కన్నా అనంతపురం పర్యటన సందర్భంగా ఇదే పరిస్థితి చోటుచేసుకోవడం గమనార్హం. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో టిడిపి-బిజెపి మద్దతుదారుల మధ్య గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అంతకుముందు మీడియా సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీకి రాయలసీమ ప్రజలు ఓట్లు వేయనందున వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహులుగా చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు రాయలసీమకు 600 వరాలిచ్చారని కానీ వాటిని అమలు చేయలేదని అన్నారు. కమిషన్ల కోసం పేదవాడి సొమ్మును ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల అంచనాలు పెంచారే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చి వాళ్ల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారని కన్నా ఆరోపించారు.