ఫార్మాసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో కీలక మలుపు.. నిందితుడిని చంపేయాలంటున్న తల్లి
అమరావతి/ హైదరాబాద్ : ఫార్మాసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. కిడ్నాప్ చేసిన రవిశంకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలిన సంగతి తెలిసిందే. అయితే రవిశంకర్ను చంపేయాలని అతని తల్లి, కుటుంబసభ్యులు డిమాండ్ చేయడం చర్చకు దారితీసింది. అతని వల్ల తమకు పరువు పోతోందని, చేసిన నేరాలతో తల ఎత్తుకోలేకపోతున్నామని వాపోతున్నారు. కానీ అతని కుమారుడు రాజయ్య నిర్దోషి అని అతనికి నేరాలతో సంబంధం లేదని చెప్తున్నారు. తన మనమడిని వదిలేసి .. కుమారుడిని చంపేయాలని కోరుతున్నారు.
ఇదీ నేపథ్యం ..
కృష్ణ జిల్లా కంకిపాడు పీఎస్ పరిధిలోని దావులూరు రవిశంకర్ స్వస్థలం. ఇక్కడినుంచే అతని నేర ప్రస్థానం ప్రారంభమైంది. ఇక్కడ పలు నేరాలు చేయడంతో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. తర్వాత దోషియర్ షీట్ కూడా తెరిచారు. దోషియర్ షీట్ అంటే ఒక్క పోలీస్ స్టేషన్ పరిధి కాకుండా రాష్ట్రంలోని మిగతా పోలీసు స్టేషన్లలో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. రవికి పెళ్లైంది ఒక కుమారుడు కూడా ఉన్నారు. అతని పేరు రాజయ్య. రవిశంకర్ భార్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురై చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఇంటికొచ్చిన రవి .. తర్వాత నుంచి కనిపించలేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
రౌడీ షీట్ నుంచి ..
2000 ఏడాది నుంచి రవి నేరప్రస్తానం ప్రారంభమైంది. అక్కడినుంచి అతని నేరాలు మొదలయ్యాయి. 19 ఏళ్ల క్రితం హోటల్లో మహిళను ఫుడ్ ఇన్ స్పెక్టర్ అని చెప్పి బంగారు గొలుసు దోచుకెళ్లాడు. 2010 వరకు కంకిపాడు పీఎస్లో వివిధ కేసులు నమోదయ్యాయి. తర్వాత తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మోసాలు చేశారు. 2014లో విజయనగరంలో ఓ కేసుకు సంబంధించి అరెస్టై .. కళ్లు గప్పి తప్పించుకన్న రవిని కృష్ణ జిల్లా పోలీసులు పట్టుకొని అప్పగించారు. తర్వాత కనిపించకుండా పోయాడు. ఇటీవల హయత్ నగర్లో సోని అనే బీ ఫార్మసీ విద్యార్థినీ కిడ్నాప్ చేయడంతో వెలుగులోకి వచ్చాడు. తమ కూతురిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కిడ్నాప్ చేశాడని సోని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
చంపేయండి ..
రవి కిడ్నాప్ ఘటనపై ఆమె తల్లి స్పందించారు. అతనిది చిన్నప్పటి నుంచి నేరస్వభావం అని పేర్కొన్నారు. అతనితో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు. అతని కుమారుడు రాజయ్యను వదిలేయాలని రవి తల్లి కోరారు. కానీ రవిని చంపేయాలని డిమాండ్ చేశారు. తీరు మార్చుకోవాలని కాళ్లు పట్టుకొని ప్రాధేయపడినా మారలేదని కన్నీరు పెట్టుకున్నారు. వాడు బతికినా .. చచ్చినా ఒక్కటేనని స్పష్టంచేశారు. తన సోదరుడు పరమ దుర్మార్గుడు అని పేర్కొన్నారు. రవికి సమాజంలో బతికే అర్హత లేదన్నాడు. అతనిని ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులను కోరారు. అక్కడే తగలబెట్టినా మేం పట్టించుకోమని .. అతను చేసే పనులతో పరువుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రవి నేరస్వభావం తెలిసిన పేరెంట్స్ అతనిని మట్టుబెట్టాలని చెప్పడం అతని తీరుకు అద్దం పడుతుంది. ఎన్ని నేరాలు చేసి, ఎంతమందిని ఇబ్బంది పెడితే వారు అలా మాట్లాడతారు. ఓ వృద్ధ తల్లి కూడా తన కుమారుడిని చంపేయాలని కోరడం ఆమె వేదనకు అద్దం పడుతుంది. రవి చేసే నీచపు పనులతో తల ఎత్తలేని పరిస్థితి అని అతని సోదరుడు వాపోయాడు.