2019లో ఏపార్టీ అధికారంలోకి రావాలన్నా...మేమే కీలకం:కాంగ్రెస్;నేడే కిరణ్ చేరిక
Recommended Video
నెల్లూరు:2019 ఎన్నికల్లో ఎపిలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్ మద్దతు కీలకమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ చెప్పారు.
జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన గురువారం నెల్లూరులో పర్యటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్ఠమవుతోందని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ దగా చేసిందన్నారు. వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి హోదా వస్తుందని మోదీ అప్పట్లో చెప్పారని, ఇప్పుడు వెంకయ్యనాయుడు, హోదా ఎటుపోయాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
నెల్లూరులో...ఊమెన్ చాందీ
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎపి వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి మెయ్యప్పన్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
మర్మం ఏమిటో...టిడిపి-బిజెపి చెప్పాలి
రూ.16 వేల కోట్లతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్ట్ రూ.58 వేల కోట్లకు ఎందుకు పెరిగిందో, దాని మర్మమేమిటో టీడీపీ-బీజేపీ వివరించాలని ఊమెన్ చాందీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటం, ప్రత్యేక హోదా సాధనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన టీడీపీ...ఓట్లు రావనే భయంతోనే ఇప్పుడు ధర్మపోరాట దీక్షలంటూ దొంగ నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్గాంధీ ప్రధానిగా ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు.
మోడీపై...భ్రమలు తొలిగాయి...
ప్రధాని మోడీపై భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని, ఈ దేశానికి కాంగ్రెస్ పరిపాలన, సిద్ధాంతాలే సరైనవన్న అభిప్రాయానికి సామాన్య ప్రజానీకం వచ్చారని ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్ తిలక్ చెప్పారు. గురువారం విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ పాలన, చంద్రబాబు పాలన ఒకేలా సాగుతున్నాయని, ప్రజలను మోసగించడంలో ఇద్దరూ ఇద్దరేనని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని, అది తమ అధ్యక్షుడు రాహుల్గాంధీ వల్లే సాధ్యమవుతుందని ఆయన స్పష్టంచేశారు.
నేడే కిరణ్...కాంగ్రెస్ లో చేరిక
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం మళ్లీ కాంగ్రెస్ లో చేరనున్నారు. ఢిల్లీలో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారు.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ అధిష్ఠాన నిర్ణయంతో విభేదించిన కిరణ్... 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీపెట్టారు. ఆ తర్వాత గడచిన నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా కాంగ్రెస్ లో చేరనున్నారు.