జనసేన పార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డు.. ఎందుకలా ?
జనసేన పార్టీ ఏపీలో ఎన్నికల ఓటమి నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికార పార్టీపై నోరు విప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓటమి పరాభవం నుండి కోలుకుంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి పాలవడంతో పార్టీలో నెలకొన్న నైరాశ్యం తొలగిపోయి మళ్ళీ పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తుంది జనసేన పార్టీ . అయితే జనసేన పార్టీ ఆఫీసులకు దర్శనం ఇస్తున్న టూలెట్ బోర్డులు మాత్రం జనసేన పార్టీ పరిస్థితిని చెప్పకనే చెప్తున్నాయి.
పార్టీ మారుతున్న నేతలు... వెలవెలబోతున్న కార్యాలయాలు
గత ఎన్నికలలో తీవ్ర పరాభవాన్ని చవిచూసిన జనసేన పార్టీ కోలుకోవాలని ప్రయత్నిస్తుంటే జరుగుతున్న పరిణామాలు మాత్రం పార్టీ ఖాళీ కానుందా అన్న భావన కలిగిస్తున్నాయి . పార్టీలో ఎన్నికలకు ముందు చేరిన చాలా మంది నేతలు పార్టీ వీడి వేరే పార్టీలో చేరారు. దీంతో చాలా జిల్లాలలో పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా పోయింది. పార్టీకి నాయకత్వ లేమి మొదటి నుండి పవన్ పార్టీని వేధిస్తుంది. ఎన్నికల ముందు ఆకుల సత్యన్నారాయణ బీజేపీని వీడి జనసేనలో చేరి మళ్ళీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బాట పట్టారు ఇక రావెల కిషోర్ బాబు టీడీపీని వీడి జనసేనలో చేరారు. తిరిగి ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు . అంతే కాదు ఆయన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని అద్దెకు ఇవ్వనున్నట్టు బోర్డు పెట్టారు.
గుంటూరు నగర శివారులోనిజనసేన పార్టీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు
గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టారు సదరు భావన యజమాని . పార్టీకి సంబందించిన లోగోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖచిత్రం కలిగిన పోస్టర్లను తొలగించకుండానే, పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసినట్లు అద్దెకు ఇస్తామని బోర్డు పెట్టటం స్థానికంగా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. రావెల జనసేనలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం , ఆయన జనసేన వీడి వెళ్ళిపోవటంతో పార్టీ కార్యాలయానికి యజమాని దానికి సంబందించిన టూ లెట్ బోర్డు, ఆ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ వంటి వాటికీ అద్దెకు ఇచ్చేలా రాసి పెట్టారు . ఈ సంవత్సరం మార్చ్ లో ఈ భవనాన్ని పార్టీ నేతలు ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా రావెల పార్టీ వీడి వెళ్ళటంతో పార్టీ కార్యాలయం కూడా మూతపడనుంది.
రావెలకు జనసేన పార్టీ కార్యాలయ అవసరం లేకనే ఆఫీస్ కు టూలెట్ బోర్డు
జనసేన నుండి బీజేపీ లోకి చేరిన రావెలకు ఇక పై జనసేన పార్టీ కార్యాలయ అవసరం ఏమి ఉండనందున ఖాళీ చేసినట్లు అర్ధం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో పలు కార్యాలయాలు కూడా ఇలానే మూత పడినట్లు తెలుస్తుంది . కొందరు నేతలు పార్టీలు మారటం , మరికొందరు నేతలు ఓడిపోయి ఆర్ధిక ఒడిదుడుకుల్లో ఉండటంతో జనసేన కార్యాలయాలు రాష్ట్రమంతటా ఇలానే ఉన్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా పవన్ పార్టీకి ఆది నుండి అన్నీ అవాంతరాలే అని , ఇప్పుడు కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నారనే భావన అందరిలో ఉంది.