అమ్మ ను కాపాడుకోవడం కోసమే...ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాః నటుడు హరి
తిరుపతి:ఎర్రచందనం అక్రమరావాణా కేసులో సినీ నటుడు హరి మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీస్టేషన్లో లొంగిపోయాడు. న్యాయవాదితో కలిసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకున్న హరి తాను లొంగిపోతున్నట్లు తెలిపాడు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇటీవలే సినీ నటుడు హరిపై టాస్క్ ఫోర్స్ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాను ఎర్రచందనం అమ్మి కోట్ల రూపాయలు సంపాదించాననే ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని హరి టాస్క్ ఫోర్స్ పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఒక కానిస్టేబుల్ తనపై కావాలనే కేసులు పెట్టిస్తున్నాడని హరి ఆరోపించాడు.
అయితే అనారోగ్యంతో ఉన్న అమ్మను కాపాడుకోవడానికే ఒకసారి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశానని హరి అధికారులకు వెళ్లడించాడట. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడు తల్లి వైద్యం కోసం అలా చేయాల్సివచ్చిందని చెప్పాడట.
సినీ నటుడు హరికి ఎర్ర చందనం స్మగ్లింగ్ లో పాత్ర ఉందని తమ విచారణలో తేలినట్లు గత గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. జబర్దస్త్ షో తో పాటు శంభో శంకర సినిమాలో నటించిన హరి...శంభో శంకర సినిమాకు ఫైనాన్స్ కూడా చేసినట్లు తెలిసింది. అలాగే మరికొన్ని సినిమాలకు కూడా ఫైనాన్స్ చేసేందుకు ఇతడు అంగీకరించినట్లు సమాచారం.
సినీ నటుడు హరిపై 25 కిపైగా కేసులు ఉన్నాయని, త్వరలోనే పూర్తి ఆధారాలతో పట్టుకుంటామని టాస్క్ఫోర్స్ అధికారులు ఆ సందర్భంలో తెలిపారు. తొలుత తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్లు...ఆ తర్వాత వారి ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్న హరి గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు అతను అనేకమంది ఆర్ఎంపి డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యార్ధులను కూడా ఈ ఎర్రచందనం అక్రమ రవాణా ముగ్గులోకి దించాడని వారు వెల్లడించారు.