రాజధాని అంశంపై రోజుకో ప్రతిపాదన : ఇప్పుడు బెంగళూరు రాజధాని కావాలట!!
ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన మూడు రాజధానుల అంశంపై ఏపీ ఇంకా అట్టుడికిపోతోంది. ఇక ఇదే సమయంలో ఒక కొత్త వాదన కూడా తెరమీదకు వచ్చింది. రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలనిడిమాండ్ చేస్తున్న రాయలసీమ వాసులు కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు. ఒకపక్క అమరావతిలో రైతులు రాజధాని తరలించవద్దు అని ఉద్యమం చేస్తుంటే ఇక రాయలసీమ వాసులు రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలని, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక తాజాగా మరో కొత్త ప్రతిపాదన చేశారు కర్నూలు జిల్లాకు చెందినటీడీపీ నేత తిక్కారెడ్డి .
రాజధానిపై కొత్త ప్రతిపాదన
గతంలో ఏపీ రాజధానిగా కర్నూలు ఉండటం, ఇక రాజధాని రాయలసీమే కావాలని దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే కోవలో తనదైన లాజిక్ చెప్పారు కర్నూలు జిల్లా టీడీపీ నేత తిక్కారెడ్డి .మాకు విశాఖ రాజధాని వద్దు.. బెంగళూరు రాజధాని ముద్దు అంటూ మరో షాకింగ్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లోనూ, అటు స్థానికంగానూ దుమారం రేపుతుంది.
సీఎం లు మారితే రాజధాని మారుతుందా ? అని ప్రశ్నించిన టీడీపీ నేత
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన నాటి నుండి అన్ని ప్రాంతాల వాళ్ళు రాజధాని తమ ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కర్నూలు కర్నోలు రాజధానిగా ఏపీ ఉందని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్.. మొన్నటి దాకా అమరావతి.. ఇక ఇప్పుడు విశాఖ ఇలా సీఎంలు మారినప్పుడల్లా రాజధానులను మార్చడం సరికాదని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డి అన్నారు.
ఆ నియోజకవర్గం కర్ణాటకలో కలిపి బెంగళూరు రాజధాని చెయ్యాలని ప్రతిపాదన
1956లో మంత్రాలయం నియోజకవర్గం కర్ణాటకలోని బళ్లారి డివిజన్లో ఉండేదని గుర్తు చేసిన ఆయన ప్రభుత్వం తాజాగా విశాఖను రాజధానిగా చెయ్యాలని తీసుకున్న నిర్ణయంతో తమకు చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా చేస్తే రాయలసీమ వాసులు తెగ ఇబ్బందులకు గురవుతారన్నారు. మంత్రాలయం నుంచి విశాఖకు వెళ్లాలంటే సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుందని ప్రయాణానికి 2 రోజులు పడుతుందన్నారు.ఇక అంత దూరం ప్రయాణించటంవల్ల సమయం , డబ్బు రెండూ వృధా అవుతాయన్నారు. అందుకే ఆయన కర్నూలు పార్లమెంట్ను కర్ణాటకలో కలిపి.. బెంగళూరును రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త వాదన వినిపిస్తున్న టీడీపీ నేత తిక్కారెడ్డి
ఇలా చేయడం వల్ల తమకు ఈ సమస్య తప్పుతుంది అని నీటికి, విద్యకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాజధాని మార్పుతో టీడీపీలో కొందరువిశాఖ రాజధాని అంటే, మరికొందరు అమరావతి మాత్రమే రాజధాని అని చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో రాయలసీమ నేత తిక్కారెడ్డి బెంగళూరు రాజధానిగా చెయ్యమని అడగటం గమనార్హం .కర్నూలు టీడీపీ నేత తీసుకొచ్చిన ఈ కొత్త ప్రతిపాదన ఇబ్బందిగా అనిపించినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు కరెక్టే .