నేడు ఏపీలో కేసీఆర్... షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి అతిథిగా వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన అనంతరం జగన్ హైదరాబాద్ లో కేసీఆర్ నివాసానికి సతీ సమేతంగా వెళ్లి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ జగన్ కు సైతం అపూర్వ స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మే 30న జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించిన జగన్ తో కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని తప్పకుండా వస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు.అక్కడ నుండి 11.25కి గేట్ వే హోటల్ కు చేరుకుని లంచ్ పూర్తిచేసుకోనున్నారు. ఆపై 12.08 గంటలకు జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వేదికగా నిలిచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు.
ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ పయనమవుతారు. అక్కడ నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే కేసీఆర్ తో పాటు జగన్, గవర్నర్ నరసింహన్ కూడా ఒకే విమానంలో ఢిల్లీ వెళతారని తెలుస్తోంది.