తిరుపతికైతే ఎందుకివ్వరు: బాబు, కెసిఆర్లపై తొగాడియా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్ రావులు హిందువుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్పి) అంతర్జాతీయ కార్యనిర్వనాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. చంద్రబాబేమో జెరూసెలం వెళ్లే క్రైస్తవులకు, కేసీఆర్ ఏమో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఆర్థిక సాయం అందిస్తున్నారని విమర్శించారు.
తిరుపతి వెళ్లేందుకు ఎస్సీ, ఎస్టీలైన హిందువులకు వారు ఒక్క రూపాయి అయినా ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో సోమవారం విహెచ్పి ఆధ్వర్యంలో జరిగిన విరాట్ హిందూ సమ్మేళనం, హనుమాన్ చాలీసా కోటి పారాయణ యజ్ఞాల్లో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్ల పేరిట హిందువులకు నష్టం చేస్తున్నారని తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువులు సురక్షితంగా ఉండాలంటే దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని, అప్పుడే మతమార్పిడులు ఆగిపోతాయని ఆయన అన్నారు. దేశం ఒక్కటే అయినపుడు రెండు రకాల చట్టాలెందుకని ఆయన అడిగారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లవ్జీహాద్ను సహించబోమని హెచ్చరించారు. నాలుగు దినాల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, మూడు గంటల్లో ముగ్గురికి తలాక్ ఇచ్చే విధానాన్ని ప్రేమ అంటారా అని ప్రశ్నించారు.
ప్రేమ అంటే శివపార్వతుల్లా కలిసి ఉండడమని హితవు చెప్పారు. ప్రతి హిందువుకు సురక్ష, సంవృద్ధి, సన్మాన్ లభించేలా అందరూ సక్రమ హిందువులుగా సంఘటితంగా మెలగాలని పిలుపునిచ్చారు. అంటరాని తనాన్ని అంతం చేయాలన్నారు. ప్రతి హిందువు నిరుపేద హిందువులను ఆదుకునేందుకు రోజు పిడికెడు బియ్యం, నెలకొక విద్యార్థికి ఫీజు, డాక్టర్లు రోజుకొక రోగికి ఉచిత వైద్యం అందించాలని కోరారు. కాశ్మీర్కు 4లక్షల మంది హిందువులు తిరిగి వచ్చినపుడే, లాహోర్, రావల్పిండి మొదలైనవి కలిసి అఖండ భారత నిర్మాణం జరిగినపుడే నేను ఉత్సవంగా భావిస్తానని ఆయన చెప్పారు.