రాజ్యసభ సీటు దక్కకపోవడంపై అలీ రియాక్షన్- జగన్ ఏం చెప్పారంటే ?
ఏపీలో వైసీపీ తరఫున రాజ్యసభ సీట్లకు పోటీ పడే అభ్యర్ధుల జాబితాను అధిష్టానం నిన్న విడుదల చేసింది ఇందులో ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశందక్కింది. ఆయనతో పాటు నెల్లూరు జిల్లా నేత బీద మస్తాన్ రావు, తెలంగాణ కు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యకు కూడా చోటు కల్పించారు.అయితే ఈ జాబితాలో ఉంటారని భావించిన టాలీవుడ్ నటుడు అలీకి మాత్రం నిరాశే ఎదురైంది.
వైసీపీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్ధుల జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై నటుడు అలీ స్పందించారు. నటుడిగా తనకు ఎస్వీ కృష్ణారెడ్డి జీవితం ఇస్తే.. రాజకీయంగా తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దారన్నారు. రాజ్యసభను తాను ఆశించలేదని, ఎప్పుడు ఏం ఇవ్వాలో జగన్కు బాగా తెలుసన్నారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని.. ఒకవేళ భవిష్యత్లో ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్పినట్లు అలీ వెల్లడించారు. తనకు ఫలానా పదవి ఇస్తామని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి గతంలో ప్రచారం చేసిన నటుడు అలీకి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది మొదట్లో అలీ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. అలీ అమరావతికి రావడంతో పదవి ఖాయమని ప్రచారం జరిగింది. జగన్ను కలిసిన తర్వాత కూడా త్వరలోనే గుడ్న్యూస్ ఉంటుందని అలీ చెప్పారు. తాను ఏమీ ఆశించకుండానే పార్టీలోకి వచ్చానని.. త్వరలోనే తన పదవికి సంబంధించి ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అలీకి రాజ్యసభ, ఎమ్మెల్సీ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవులు వస్తాయని చర్చ జరిగింది. కానీ ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులన్నీ భర్తీకావడంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవిపై చర్చ జరిగింది. ఆ పదవి కూడా ఇప్పటికే ఖాదర్ బాషాకు ఇచ్చారు.. తర్వాత రాజ్యసభ ఇస్తారని చెప్పుకున్నారు. కానీ ఈసారి కూడా అలీకి పదవి దక్కలేదు.. ఆయన మాత్రం తాను పదవి ఆశించడం లేదంటున్నారు.