చిరంజీవి: సినిమాల్లో ట్రెండ్ సెట్ చేశారు..రాజకీయాల్లో ఫాలో అయ్యారు.. అందుకే
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని పేరు ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పేరు. ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండనే ఉండరు. చిరంజీవి అనే పేరు జనంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందంటే.. ఎవరైనా కాస్త స్టయిలిష్ గా కనిపిస్తే.. చిరంజీవిలా ఉన్నావు కదరా? అని అనిపించుకునేంతలా. ట్రెండ్ సెట్ చేయడం అంటే ఇదే. ట్రెండ్ సెట్ చేశారు? అనడానికి అసలైన నిర్వచనం ఇచ్చారాయన. చరిత్ర మన గురించి చెప్పుకోకపోవచ్చు.. కానీ చరిత్ర మనతోనే ఆరంభం కావాలి.. అనేది ఆయన నటించిన తాజా చిత్రం సైరాలో ఓ డైలాగ్. చిరంజీవి సినీ ప్రస్థానానికి అతికినట్టు సరిపోయే డైలాగ్ అది.
అసలైన ట్రెండ్ సెట్టర్.. మెగాస్టార్
సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందాలంటే ఎవరిదైనా అండదండలు ఉండాలంటారు. సినీ పెద్దల ఆశీర్వాదం ఉంటే గానీ పరిశ్రమలో నిలదొక్కుకోలేమని చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో.. ఎవ్వరి ప్రోత్సాహం లేకుండా స్వయంకృషితో చిరంజీవి ఏ స్థాయికి చేరుకున్నారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. తన కృషి, పట్టుదలతో మాత్రమే ఆయన చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. చరిత్రలో నిలిచిపోయాలా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆధునిక చిత్ర పరిశ్రమకు బాటలు వేశారు. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో.. దశాబ్దాల కిందటే కనిపెట్టారు. దానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడమే కాదు.. చిత్ర పరిశ్రమనూ మార్చివేశారు. బ్రేక్ డాన్స్ కు చిరంజీవే ఆద్యుడు. డాన్స్ లో ఆయన వేసిన పునాదుల మీదే ఆకాశ హర్మ్యాన్ని నిర్మించారు తదుపరి నటులు.
రాజకీయాల్లో ముద్ర వేయలేకపోయినా..
రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేయలేకపోయారు. ఆనవాయితీగా వస్తోన్న ట్రెండ్ ను అనుసరిస్తూ వెళ్లారే గానీ.. చిత్ర పరిశ్రమ తరహాలో రాజకీయ రంగంపై తనదైన ముద్ర వేయలేకపోయారు. దీనికి కారణాలు అనేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో తలపండిన ఇద్దరు హేమాహేమీలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ప్రజారాజ్యం పేరుతో సరికొత్త పార్టీని స్థాపించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, దాన్ని భర్తీ చేసి, ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో తాను ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పినట్లు చిరంజీవి చెప్పుకొన్నారు. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల్లో పోటీకి నిల్చున్నారు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని పెట్టినా 18 స్థానాలు..
చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులు గానీ, కొత్తగా ఓ పార్టీ నెలకొల్పడానికి అనువైన వాతావరణం గానీ లేని సమయంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం సరి కాదనే అభిప్రాయాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తుండటం, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్న పరిస్థితుల్లో చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం సరికాదని చెప్పే వారి సంఖ్యే అధికంగా కనిపిస్తుంటుంది.. ఇప్పటికీ. 2009 నాటి ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది ప్రజారాజ్యం పార్టీ. అసెంబ్లీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు మెగాస్టార్.
కాంగ్రెస్ ను కాపాడలేకపోయిన ఛరిష్మా
ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని అక్కున చేర్చుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఛరిష్మాను చిరంజీవికి ఉందని భావించి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుంది. చిరంజీవిని రాజ్యసభకు పంపించడం మాత్రమే కాకుండా.. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చోటు కల్పించింది. కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా ఆయన పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కాస్త బరువైన బాధ్యతలనే అప్పగించింది. రాష్ట్ర పీసీసీ ప్రచార సారధిగా నియమించినప్పటికీ.. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీపై ఏర్పడిన వ్యతిరేకత నుంచి చిరంజీవి ఛరిష్మా పార్టీని కాపాడలేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా పరాజయం పాలైంది. కాంగ్రెస్ తో పాటే చిరంజీవి కూడా దాదాపు రాజకీయ తెర మీది నుంచి నిష్క్రమించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తరువాత ఆయన మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చారు. తన తొలి కమ్ బ్యాక్ మూవీతోనే సంచలనం సృష్టించారు. తన స్థానం ఎప్పటికీ తనదేనని నిరూపించుకున్నారు.