వైఎస్ జగన్ ను కలిసిన ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాస రావు
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ స్టూడియో ఎన్ ఛైర్మన్ నార్నె శ్రీనివాస రావు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్ ను కలిశారు. ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన స్వయానా పిల్లనిచ్చిన మామ.
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి ఆయన. తెలుగుదేశం పార్టీకి దగ్గరి వ్యక్తిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా కావాల్సిన వ్యక్తిగా నార్నె శ్రీనివాసరావుకు పేరు ఉంది. దగ్గరి బంధువు కూడా. హఠాత్తుగా ఆయన వైఎస్ జగన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నార్నె శ్రీనివాసరావు, జగన్ కొన్ని నిమిషాల పాటు లోటస్ పాండ్ లో ఏకాంతంగా మాట్లాడుకున్నారని చెబుతున్నారు. కొద్దికాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరిగాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు జగన్ ను కలిసిన రెండు గంటల వ్యవధిలో నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ ను కలవడంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన కూడా వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. నార్నె శ్రీనివాస రావు దీన్ని తోసిపుచ్చారు. తాను మర్యాదపూరకంగా మాత్రమే జగన్ ను కలవడానికి వచ్చానని అన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కలిశానని చెప్పారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.