బాలకృష్ణ ఏమయ్యారు?: ఆప్తమిత్రుడు కదిరి బాబురావు వైసీపీలో చేరికపై స్పందించని బాలయ్య..!
అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమౌతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకులు, సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు..మాజీ మంత్రులు.. పార్టీని వీడుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకొంటున్నారు. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం పునాదులు కదిలిపోయే స్థాయిలో వలసలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస వలసల పట్ల పార్టీ అగ్ర నాయకత్వం తీవ్ర కలవరానికి గురి అవుతోంది.
బావపై దాడి మొదలుకుని..
ఇంతా జరుగుతున్నప్పటికీ.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జాడ కనిపించట్లేదు. ఈ సంఘటనలపై ఆయన స్పందించిన సందర్భాలు లేవు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద సొంత బావ, పార్టీ అధినేత చంద్రబాబుపై దాడి సంఘటన మొదలుకుని.. నిన్న, మొన్నటి మాచర్ల ఉదంతం వరకూ చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాలకృష్ణ మౌనంగా ఉంటూ వస్తున్నారు. పెదవి విప్పడానికి సుముఖంగా లేరు.
ఆప్త మిత్రుడు పార్టీ ఫిరాయించినా..
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడనే పేరుంది. 2014 ఎన్నికల్లో బాలకృష్ణ రెకమండ్తోనే చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చారని కూడా బాబురావు పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. తాను బాలకృష్ణను చూసే ఇన్ని రోజులు టీడీపీలో కొనసాగాననీ చెప్పుకొన్నారు. అలాంటి ఆప్తమిత్రుడు పార్టీని వీడిపోయారు. వైఎస్ఆర్సీపీలో చేరారు. దీనిపై బాలకృష్ణ స్పందించడానికి నిరాకరిస్తున్నారు.
రామసుబ్బారెడ్డి, కరణం బలరాం చేరికలపైనా..
తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగిన నాయకులు మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి. మాజీమంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రామసుబ్బారెడ్డి. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచీ కరణం బలరాం కొనసాగుతూ వచ్చారు. పునాదులు పడినప్పటి నుంచీ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన ఆ ఇద్దరు నాయకులు గుడ్బై చెప్పారు. దీనిపైనా బాలకృష్ణ పెదవి విప్పట్లేదు.
Recommended Video
బుద్ధా వెంకన్న, బోండా ఉమాలపై దాడి చోటు చేసుకున్నా..
పార్టీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద చోటు చేసుకున్న దాడి ఘటనపైనా స్పందించడానికి బాలకృష్ణ ముందుకు రాలేదు.. కనీసం ఆసక్తి కూడా చూపలేదు. కొద్దిరోజుల వ్యవధిలో నమోదైన ఈ ఉదంతాలన్నింటిపైనా తన వైఖరిని, అభిప్రాయాన్ని వెల్లడించడానికి బాలకృష్ణ కనీసం అందుబాటులో కూడా లేకుండాపోయారని తెలుస్తోంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న తన తదుపరి సినిమా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని చెబుతున్నారు.