నల్లమలలో యురేనియం తవ్వకాలపై విజయ్ దేవరకొండ కామెంట్స్!
కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ వస్తోన్న వార్తలు కొద్దిరోజులుగా అలజడిని రేపుతున్నాయి. ప్రధానంగా తెలంగాణలో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ సుమారు నెలరోజులుగా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. నల్లమల అడవులు, కొండ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలను అడ్డుకోవాలంటూ కొద్దిరోజులుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు తలపెట్టిన ఉద్యమానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.
#savenallamala pic.twitter.com/ytsPoP2kuL
— Sekhar Kammula (@sekharkammula) August 27, 2019
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ క్యాంపెయిన్ ను చేపట్టారు. #SaveNallamala అనే హ్యాష్ ట్యాగ్ తో ఆయన ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నల్లమలలో యురేనియం తవ్వకాలపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా- ప్రముఖ యువనటుడు విజయ్ దేవరకొండ ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. నల్లమల అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ చేశారు. 20 వేల ఎకరాలకు పైగా పచ్చని నల్లమల అడవులకు ముప్పు పొంచి ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇప్పటికే అభివృద్ధి పేరుతో చెరువులు, కుంటలు, వరద కాలువల నాశనం చేశామని, మరోసారి చేతులారా పచ్చటి ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
మన దేశంలో కరవు కోరల్లో చిక్కుకోని, వరదల బారిన పడని రాష్ట్రం అంటూ ఏదీ లేదని, దీనికి ప్రధాన కారణం వాతావరణంలో సమతౌల్యం లోపించడమేనని చెప్పారు. ఒకవంక కరవ, మరోవంక వరదలు మానవ సమాజంపై దాడి చేస్తున్నాయని అన్నారు. పట్టణీకరణ పేరుతో మంచినీటిని సైతం కలుషితం చేసుకున్నామని, స్వచ్ఛమైన నీరు దొరకని పరిస్థితికి మానవ ప్రయత్నాలే కారణమని అన్నారు.
#SaveNallamala pic.twitter.com/zGEe8fVk6N
— Vijay Deverakonda (@TheDeverakonda) September 12, 2019
గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ప్రజలను వెంటాడుతున్నాయని విజయ్ దేవరకొండ చెప్పారు. రోజువారీ అవసరాల కోసం మంచినీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. మనం చేసిన మంచిపని ఏదైనా మిగిలి ఉందంటే అది నల్లమల అడవులను పరిరక్షించుకోవడమేనని, ఇప్పుడు దాన్ని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం సరికాదని అన్నారు.
#SaveNallamala Earth doesn’t belong to man,man belongs to Earth. — In 1852, the United States Government inquired about buying the tribal lands for the arriving people of the United States, & the Chief Seattle wrote a marvellous letter in reply. pic.twitter.com/0x3H7dArDH
— Pawan Kalyan (@PawanKalyan) September 11, 2019