వైఎస్ఆర్ సీపీలో చేరిన హాస్యనటి, టీవీ యాంకర్! టీడీపీ అభ్యర్థులను ఓడిస్తానంటోన్న మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: పొలింగ్ ముగింట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే కడప జిల్లాలోని బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణమూర్తి వైఎస్ఆర్ సీపీలో చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు కూడా వైఎస్ఆర్ సీపీ కండువా కొప్పుకొన్నారు. తాజాగా- తెలుగు చిత్రపరిశ్రమ నటులు, బుల్లితెర ప్రముఖులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ : నాడు ఆరోపణలు ఎందుకు చేసామంటే :ఇక ప్రచారంలోకి..!
హాస్యనటి హేమ
బుల్లితెర యాంకర్ శ్యామల, ఆమె భర్త సోమవారం ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వారికి పార్టీ కండువా కప్పి, సాదరంగా ఆహ్వానించారు. తెలుగులో పలు ప్రైవేటు ఛానాళ్లలో ఆమె యాంకర్ గా పనిచేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 లో టైటిల్ కోసం పోటీ పడ్డారు. అంతకుముందే- ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత కూడా వైఎస్ఆర్సీసీపీలో చేరారు.
చంద్రబాబు సన్నిహితుడు ఎస్సీవీ నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైఎస్ఆర్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆయన ఇదివరకు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశంలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీ టికెట్ ను ఆశించారు. చివరి నిమిషం వరకూ ఎస్సీవీ నాయుడును ఊరిస్తూ వచ్చిన చంద్రబాబు.. అనంతరం హ్యాండిచ్చారు. మాజీమంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీనితో తీవ్ర అసంతృపికి గురైన ఎస్సీవీ నాయుడు పలుమార్లు చంద్రబాబును కలిసి, తన గోడును వెల్లబోసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయనకు ఊరట లభించలేదు. దీనితో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ సీపీలో చేరారు.
ఆ మూడు చోట్లా టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతా..
తనకు టికెట్ దక్కకపోవడంతో ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు నాయుడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పార్టీ అభ్యర్థులను ఓడించడానికి సర్వశక్తులనూ ఒడ్డుతానని చెబుతున్నారు. శ్రీకాళహస్తి సహా, సత్యవేడు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని శపథం చేశారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీని వీడానన్నారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఎస్సీవీ నాయుడు పార్టీ మారడంపై శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి స్పందించారు. పార్టీ నుంచి ఎవరూ బయటికి వెళ్లినా, తన గెలుపునకు వచ్చిన ఢోకా ఏమీ లేదని తేలిగ్గా తీసుకున్నారు. టీడీపీ నుంచి ఎవరూ వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు. అధికారం కోసం ఆయన తన తండ్రి దగ్గర ఉంటూ కాంట్రాక్టులు, ఇతర పనులు చేసుకున్నాక ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పార్టీ వీడారన్నారు. నేతలు పార్టీ వీడినా.. తమను నమ్ముకున్న కేడర్ తమతోనే ఉందన్నారు. బొజ్జల కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయరంగంలో కొనసాగుతోందని.. తమపై ఎలాంటి మచ్చలేదన్నారు.