పదవిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, రోడ్డుపైకి రాకతప్పదు: మోహన్ బాబు
అమరావతి: టాలీవుడ్ సినిమాల్లో ఆయన శైలి విలక్షణం. విభన్నమైన డైలాగ్ డెలివరీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుుకున్నారు మోహన్ బాబు. వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో చురకలు వేశారు. గురువారం కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
"రాజకీయాల్లో నేనిప్పుడు లేను. రేపు వస్తానో... ఏ పార్టీలోకి వస్తానో తెలియదు. కానీ, బండి ఒక నదిలో వెళ్లాలంటే... నదిలో పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డుకు చేరిన తర్వాత, బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, ఏదో ఒక రోజు రోడ్డుపైకి రాకతప్పదు" అని అన్నారు.
మాతృభాష తెలుగును మరవకుండా ఇంగ్లీషులో పట్టును సాధించాలని విద్యార్ధులకు పిలుపునిచ్చారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యాభ్యాసంలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన వారికి మోహన్ బాబు బహుమతులను అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తాను తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు మోహన్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే తాను ఏ పార్టీలో చేరేది మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.