Hero Nagarjuna : విజయవాడ ఎంపీగా పోటీ- క్లారిటీ ఇచ్చేసిన హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విజయవాడ ఎంపీ సీటు నుంచి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను విజయవాడ ఎంపీగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు గత నెలలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిపై అప్పట్లో నాగార్జున కూడా మౌనంగా ఉండటంతో ఇదే నిజమని అంతా భావించారు. కానీ తాజాగా నాగార్జున ఈ ఊహాగానాలపై స్పందించారు.
ఏపీలో తన రాజకీయ రంగ ప్రవేశంపై హీరో అక్కినేని నాగార్జున ఇవాళ తన వైఖరిని మరోమారు కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు వస్తున్న ప్రచారంపై నేరుగానే స్పందించారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే తనకు లేదని నాగార్జున తేల్చిచెప్పేశారు. అంతేకాదు విజయవాడ ఎంపీగా కూడా తాను పోటీ చేయడం లేదని స్పష్టంచేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తనపై ఇలాగే ప్రచారం చేస్తున్నారంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేసారు.
వాస్తవానికి టాలీవుడ్ హీరో నాగార్జునకు సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాకముందు నుంచి వీరిద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి. జగన్ గతంలో జైల్లో ఉన్న సమయంలోనూ నాగార్జున వెళ్లి పరామర్శించారు. అధికారంలోకి వచ్చాక కూడా మరో సీనియర్ హీరో చిరంజీవితో కలిసి పలుమార్లు సీఎం జగన్ ను ఆయన కలిసి వచ్చారు. పలు కీలక నిర్ణయాల్లో భాగస్వామి కూడా అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున నాగార్జున విజయవాడ లోక్ సభ స్థానం సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో వైసీపీకి గట్టి అభ్యర్ది లేకపోవడం, గతంలో పోటీ చేసిన పీవీపీ వంటి వారు తప్పుకోవడంతో నాగార్జునను తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగార్జున అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పేశారు.