అమరావతికి సినీకలర్: వెంకటేశ్తో పాటు సుమన్, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఈనాడు గ్రూప్ సంస్ధల అధినేత రామోజీరావు అమరావతి శంకుస్థాపన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు.
రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేశ్ కూడా ఉద్దండరాయుని పాలెంలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
మాజీ మంత్రి, టాలీవుడ్ నటుడు కృష్ణం రాజు, సుమన్, ‘మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తదితరులు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు. నటుడు పోసాని కృష్ణమురళి, డెరైక్టర్ బోయపాటి శ్రీనివాస్లు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ సమయానికి మరింత మంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లాకు చెందిన సూపర్స్టార్ ఘట్టమనేని కృష్ణ, ఆయన తనయుడు మహేశ్బాబు, జమున, ప్రముఖ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం, హీరో శివాజీ, దర్శకుడు బోయపాటి శ్రీను, పోసాని కృష్ణమురళి, కృష్ణా జిల్లాకు చెందిన అక్కినేని నాగార్జున, పశ్చిమగోదావరి జిల్లా వాసులైన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కుటుంబాలకు ఆహ్వానపత్రాలు అందిన సంగతి తెలిసిందే.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఏపీ ప్రభుత్వ తరఫున ఆహ్వానం పలుకుతున్నట్లు కార్యక్రమ వ్యాఖ్యాతలు సాయికుమార్, సునీత అన్నారు. తెలుగు స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తూ.. ప్రపంచ నగరాలకే తలమానికంగా అమరావతి నగరాన్ని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
స్వర్గంలోని దేవేంద్రుడి రాజధానిని తలదన్నేలా నిర్మించనున్న అమరావతిని నగర శంకుస్థాపన కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు తరలిరావడం రాష్ట్రానికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. మరోవైపు అమరావతి ప్రధాన వేదిక వద్ద ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి.