గాలి కూతురు వివాహానికి హాజరయ్యే తెలుగు బడా హీరోలు వీరే?
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి వివాహానికి తెలుగు సినీ రంగానికి చెందిన అగ్ర హీరోలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలుగు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాహానికి హాజరు అవుతారని అంటున్నారు.
గాలి జనార్ధన్రెడ్డి కూతురు బ్రహ్మణి హైద్రాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్రం దేవారెడ్డి కుమారుడు రాజీవ్రెడ్డితో జరగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరి నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. పెళ్లి కార్డుతో అదరగొట్టిన గాలి, కూతురి పెళ్లికి అతిరథ మహారథులకు ఆహ్వానాలు పంపారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, తెలుగు హీరోలు ప్రభాస్, మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు వివాహానికి హాజరవుతారని అంటున్నారు. వీరు మాత్రమే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకులు, నిర్మాతలు కూడా గాలి జనార్ధనరెడ్డి కూతురి పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
పెళ్లికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా రైళ్లను కూడా వేస్తున్నట్లు తెలిసింది. అక్రమ మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్ధన్రెడ్డి బెయిల్పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా కేసు ఒత్తిళ్లకు దూరంగా ఉన్న గాలి వ్యక్తిగత వేడుకల్లో బిజీగా గడుపుతున్నారు.
తెలుగు హీరోలు పెళ్లి కూతురు తరఫున వెళ్తారా, పెళ్లి కుమారుడి తరఫున వెళ్తారా అనేది మాత్రం తెలియడం లేదు.