టికెట్ల ధరలపై పునరాలోచించాలి- జగన్ కు చిరంజీవి ట్వీట్-పరిశ్రమను ఆదుకోవాలని వినతి
ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ నిన్న కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ఆమోదించారు.ఇందులో ఆన్ లైన్ టికెట్ల విధానంతో పాటు రోజుకు నాలుగో షాలు మాత్రమే, ఏ సినిమా అయినా ఒకటే టికెట్ రేటు అంటూ కొత్త నిబంధనల్ని కూడా తీసుకొచ్చారు. దీనిపై టాలీవుడ్ నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. అన్ని సినిమాలకూ ఒకటే రేటు పెడితే మాకు సినిమా తప్పదంటూ టాలీవుడ్ మండిపడుతోంది. దీనిపై ఇవాళ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
Recommended Video
సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ లో మెగాస్టార్ చిరంజీవి పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. మా కోరికపై ఆన్ లైన్ టికెట్ల విధానం పెట్టారు సరే.. ఈ ఒకే టికెట్ రేటు నిర్ణయమేంటని ఆయన ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే ఏపీలో చిత్ర పరిశ్రమ బతికి బట్టకట్టాలంటే ఈ చర్యలు తీసుకోవాలని చిరంజీవి సీఎం జగన్ ను కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
చిరంజీవి తన ట్వీట్ లో.. "పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షణీయం. అదే విధంగా ధియేటర్ల మనుగడ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకుదెరువు కోసం తగ్గించిన రేట్లను కాలనుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది." అంటూ పేర్కొన్నారు.
Appeal to Hon’ble @AndhraPradeshCM
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh
ఈ ట్వీట్ కు ఆంధ్రప్రదేశ్ సీఎం కు ట్యాగ్ చేశారు. మరి చిరంజీవి విజ్ఞప్తిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ నిర్ణయంతో పెద్ద సినిమాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో అదే టాలీవుడ్ కోరుతున్న విధంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.