విశాఖ లేదా అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ: సినీ ప్రముఖులతో చంద్రబాబు
తక్కువ బడ్జెట్ సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
Recommended Video
అమరావతి: తక్కువ బడ్జెట్ సినిమాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని మంగళవారం సాయంత్రం తనను కలిసిన సినీ ప్రముఖులతో అన్నారు.
సాగర నగరం విశాఖకు తరలించాలని ఎక్కువమంది కోరుతున్నారని, రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాలలో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు హైదరాబాదులో
ఒకనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకునేలా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు సొంత రాష్ట్రానికి వస్తామని పరిశ్రమలోని అత్యధికుల నుంచి వస్తున్న వినతుల్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు ఒకనాడు తెలుగు, తమిళ సినిమాల షూటింగులకు ముఖ్య చిరునామాగా ఉండేదని గుర్తుచేశారు. విశాఖలో సినీ స్టూడియోలు నిర్మించేందుకు ఇప్పటికే అనేకమంది ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. విశాఖ, అమరావతిలో పరిశ్రమ ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బంది లేదని, విశాఖ బ్యుటిఫుల్ రెడీమేడ్ సిటీ అయితే, అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు.
ముందే పసిగట్టాలి
ఏపీ ప్రజానీకం సృజనశీలురని, ప్రపంచగమనంలో వచ్చే మార్పులను ముందుగానే పసిగట్టి అవకాశాలను ఒడిసి పట్టుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. చలనచిత్ర పరిశ్రమలోని ఉన్నవారంతా కొత్త రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తన అభిలాషగా చెప్పారు.
త్వరలో పాలక వర్గం
త్వరలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమిస్తామని తెలిపారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాల ఎంపిక జాబితాలను జ్యూరీ బృందాలు తొలుత ముఖ్యమంత్రికి అందించాయి. మూడేళ్ల జ్యూరీలకు నేతృత్వం వహించిన గిరిబాబు, జీవిత, పోకూరి బాబురావు ఈ సందర్భంగా ఎంపికచేసిన వారి పేర్లను ముఖ్యమంత్రికి చదివి వినిపించారు. విజేతల ఎంపిక నిష్ఫాక్షికంగా జరిగిందని సీనియర్ నటుడు గిరిబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
కలిసింది వీరే
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ, మురళీమోహన్, అంబికా కృష్ణ, ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్, కళ్లు రఘు, జర్నలిస్టు ప్రభు, ఊహ, సీనియర్ నటి ప్రభ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు ఉన్నారు. జనవరి మాసంలో నంది చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రాథమిక నిర్ణయించారు. తన భర్త రాజశేఖర్ హీరోగా ఇటీవల విజయవంతమైన చిత్రం ‘గరుడవేగ' చూడాలని నటి, దర్శకురాలు జీవిత ముఖ్యమంత్రిని కోరారు. ఆ సినిమా కథాంశం ఏమిటని ముఖ్యమంత్రి ఆసక్తిగా అడిగి ఆమె నుంచి వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు నిర్మాత సురేశ్ బాబు నేతృత్వంలో మరో కమిటీ ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపికచేసిన వారి వివరాలతో ఒక జాబితాను ముఖ్యమంత్రికి అందించింది.