బియాస్, ఆరో మృతదేహం: జ్వాలా తదితరుల స్పందన
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాన్ నదిలో మంగళవారం మధ్యాహ్నం మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు.
లార్జి జలాశయం వద్ద రక్షణ సిబ్బంది ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మృతదేహం ఎవరిదనేది గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది.
మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లార్జి జలాశయ సిబ్బంది నిర్లక్ష్యంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముగ్గురు లార్జి జలాశయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాగా, బియాన్ నది ట్రాజెడీ పైన పలువురు సెలబ్రటీలు స్పందించారు.
గుత్తా జ్వాలా
హిమాచల్ ప్రదేశ్లో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారనే వార్త తెలిసి తీవ్ర ఆవేదన చెందానని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని గుత్తా జ్వాలా అన్నారు.
మంచు మనోజ్
హిమాచల్ ప్రదేశ్లో బియాస్ నది వద్ద గల్లంతైన విద్యార్థులు ఎక్కడో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, వారి కోసం, వారి కుటుంబాల కోసం దేవుడిని ప్రార్థించుదామని మనోజ్ చెప్పారు.
సమంత
ఇది అత్యంత విషాధ సంఘటన, హిమాచల్ ప్రదేశ్ ప్రమాదంలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులకు దేవుడు మానసిక ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని సమంత అన్నారు.
ప్రభాస్
ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం విషాదకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి విద్యార్థుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని ప్రభాస్ ట్వీట్ చేశారు.
రాజమౌళి
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతయ్యారనే వార్త ఎంతో చాలా విషాదకరమైనదని దర్శకులు రాజమౌళి అన్నారు.
వరుణ్ సందేశ్, నవదీప్, రిచా పనాయ్
కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని వరుణ్ సందేశ్, నవదీప్ ట్వీట్ చేశారు. రిచా పనాయ్... ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు వార్త చాలా బాధాకరమని ట్వీట్ చేశారు.