పెద్ద నగదు నోట్ల రద్దుతో జాక్ పాట్ కొట్టిన టమాటా వ్యాపారి
చిత్తూరు: పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందిపడుతోంటే....చిత్తూరు జిల్లాకు చెందిన టమాటా వ్యాపారి మాత్రం జాక్ పాట్ కొట్టారు.పెద్ద నగదు నోట్ల రద్దు తో అందరూ ఇబ్బందిపడుతోంటే ఈ వ్యాపారి మాత్రం లాభపడ్డాడు.
కేంద్ర ప్రభుత్వం పెద్దనగదు నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో మదనపల్లికి చెందిన టమాట వ్యాపారి ఒక్కరోజే కమీషన్ రూపంలో లక్షన్నర రూపాయాలను ఆర్జించాడు. తన వద్ద ఉన్న చిన్న నగదే తనకు జాక్ పాట్ దక్కింది.
మదనపల్లిలో వ్యాపారి ఒకరు టమాటాలను విక్రయిస్తుంటారు. అయితే టమాటాల విక్రయాల ద్వారా అతనికి 10 లక్షలు సమకూరాయి. ఈ 10 లక్షల రూపాయాలు పెద్ద నగదు కాకుండా వంద, యాభై, ఇరవై, పది రూపాయాల రూపాయాల ఈ డబ్బులు సమకూరాయి.ఈ నగదే ఆ వ్యాపారికి లాభాన్ని ఆర్జించి పెట్టింది.
రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్దనగదు నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నగదు మార్పిడిచేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ నోట్లను మార్పిడి చేసుకోకపోతే రోజు గడవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంద,యాభై రూపాయాలతో పాటు ఇతర నగదు ఈ వ్యాపారి వద్ద ఉన్న విషయాన్ని తెలుసుకొన్న స్థానికులు క్యూ కట్టారు. పెద్ద నగదు నోట్లను మార్చుకోవడానికి వచ్చారు. వెయ్యి రూపాయాలకు వంద రూపాయాలను కమీషన్ తీసుకొని ఆయన చిలల్లరను ఇచ్చాడు. సామాన్యులతో పాటు, వ్యాపారులు అవసరం ఉన్నవారంతా టమాటా వ్యాపారి వద్దకు వచ్చి మరీ చిన్న నగదును తీసుకెళ్ళారు. ఒక్క రోజులోనే సుమారు లక్షన్నర రూపాయాలను ఈ టమాట వ్యాపారి కమీషన్ రూపంలో లాభాన్ని ఆర్జించాడు.