పారేస్తాం కానీ పాక్ ఇవ్వం: టమోట ఢమాల్
పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమోటో ధరలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. కేజీ టమోటో రూ. 3 నుంచి రూ. 7 వరకు విక్రయిస్తున్నారు.
తిరుపతి: పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 నోట్లు రద్దు కారణంగా నిత్యం ఎర్రగా నిగనిగలాడే టమోటో ధరలు పడిపోయాయి. ఈ దెబ్బతో రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు దారుణంగా పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మనం ప్రతి రోజూ ఏ కూర చెయ్యాలన్నా టమోటో కచ్చితంగా ఉండాల్సిందే. చివరికి మాంసాహారం చెయ్యాలన్నా టమోటో తప్పనిసరిగా ఉండాలి. సాదారణంగా చలికాలంలో టమోటో ధరలు రెట్టింపు అవుతాయి.
చలికాలంలో టమోటోలు ఎక్కవ రోజులు తాజాగా ఉండకపోవడంతో ఇప్పుడు వ్యాపారులు వాటిని ఏమి చెయ్యాలో తెలీక రోడ్ల మీద కుప్పలు కుప్పలుగా పోసేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి,
టమోటో కిలో రూ. 3 నుంచి రూ. 7 వరకు పలుకుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని పింపిల్ గావ్ లో దేశంలో అతి పెద్ద టమోటో మార్కెట్ ఉంది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో అతి పెద్ద టమోటో మార్కెట్ ఉంది.
ఈ ప్రాంతాల నుంచి టమోటోలు ఎగుమతి కాకపోవడంతో రైతులు చెట్లలోనే టమోటోలు వదిలేస్తున్నారు. కొంత మంది రైతులు టమోటోలు మార్కెట్లకు తీసుకు వెళ్లిన ఎక్కువ ధర రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పాక్ కు టమట, కారం దెబ్బ: కూరగాయలు ఇవ్వం
నాగాలాండ్, జార్ఖండ్, అస్సాంలో తప్పా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టమోటో ధరలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. టమోటోలు తీసుకునే మార్కెట్ యార్డు వ్యాపారులు బ్యాంకు చెక్ లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా రైతులు వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.
టమోటో ధరలు పడిపోవడానికి ఇదీ ఒక కారణం అయ్యింది. టమోటోలు మార్కెట్ కు తీసుకువెళితే రవాణా చార్జీలు కూడారావని రైతులు ముందుకురావడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఈ దెబ్బతో టమోటో ధరలు పడిపోయాయి.
భారత్ నుంచి పాక్ పెద్ద ఎత్తున టమోటోలు ఎగుమతి చేసేవారు. అయితే ఊడీ ఉగ్రదాడి, పీవోకేలో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత టమోటోలు పాక్ ఎగుమతి చెయ్యమని వ్యాపారులు తేల్చి చెప్పారు.
ఇదీ ఒకరకంగా టమోటో ధరలు పడిపోవడానికి కారణం అయ్యింది. అప్పటి నుంచి భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో టమోటోలు రోడ్ల మీద అయినా విసిరేస్తాం కాని పాక్ మాత్రం ఎగుమతి చెయ్యం అని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. మాకు వ్యాపారం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అని తేల్చి చెబుతున్నారు.