రేపటినుంచి ‘సకల జనుల సమ్మె’ పాలు, మందులు, ఆస్పత్రి తప్ప, రాజధాని జేఏసీ మలిదశ ఉద్యమం
రాజధాని ప్రాంత రైతులు మలిదశ ఉద్యమానికి సిద్ధమవుతోన్నారు. గత 16 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నారు. శుక్రవారం నుంచి సకల జనుల సమ్మె చేపట్టాలని రాజధాని ప్రాంత రైతులు ఐక్య కార్యచరణ సమితి (జేఏసీ) నిర్ణయం తీసుకొన్నది. అత్యవసర వస్తువులకు మాత్రం మినహాయింపు ఇస్తామని స్పష్టంచేశారు.
వీటికి మినహాయింపు
ఆస్పత్రులు, మందుల షాపులు, పాల సరఫరా తప్ప మిగతా కార్యకలాపాలు బంద్ చేయాలని రాజధాని ప్రాంత జేఏసీ నిర్ణయం తీసుకొన్నది. రాజధాని మార్పుపై ఉద్యమిస్తోన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రెండో దశ ఉద్యమిస్తున్నట్టు పేర్కొన్నది. రాజధాని కోసం భూములిచ్చినా 29 గ్రామాల్లో బంద్ చేపడుతామని ప్రకటించారు.
బీసీజే రిపోర్ట్
శుక్రవారం బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్ట్ రాబోతుంది. ఈ కమిటీ కూడా మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీసీజే నివేదిక తర్వాత హైపవర్ కమిటీ కూడా రిపోర్ట్ అందజేయనుంది. కమిటీల నివేదికపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదింపజేసుకుంటామని ఏపీ మంత్రులు సంకేతాలు ఇచ్చారు.
దూరంగా..
మరోవైపు అమరావతి చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. గ్రామాస్తుల నుంచి ఆగ్రహాం వ్యక్తం కావడంతో మిన్నకుండిపోయారు. మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు అందుబాటులో లేరు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు నేతలు మాత్రం రాజధాని మార్పు ప్రతిపాదనను స్వాగతించారు.
రాష్ట్రపతికి లేఖ
ఓ వైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే మరోవైపు రాజ్యాంగ బద్దమైన పదవీలో ఉన్న ముఖ్యులకు కూడా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జేఏసీ లేఖలు రాస్తున్నది. మరికొన్నింటిలో కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతికి కూడా జేఏసీ లేఖలు రాసింది. అన్నీ విధాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని జేఏసీ ప్రణాళిక రచించుకొని అడుగులు వేస్తున్నది.