ఢిల్లీ లో రేపే వైసీపి వంచన దీక్ష..! దద్దరిల్లనున్న జంతర్ మంతర్..!!
ఢిల్లీ/ హైదరాబాద్ : దేశ రాజదాని ఢిల్లీ లో మళ్లీ నిరశనల పర్వం ఆరంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినందకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన కార్యక్రమం తలపెట్టింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఈ ఆందోళన చేపట్టింది. గురువారం జరగబోయే గర్జనకు సంబంధించి వేదిక ఏర్పాట్లను ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీలు వైవీసుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, బొత్ససత్యనారాయణలు పరిశీలించారు.
ఏపీ సీయం చంద్రబాబు నాయుడుపై వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని మాత్రమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అడిగింది లేదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రం ఏపీకీ ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ ప్రకటించినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఉంచి బయటకి వచ్చి ఉంటే పరిస్ధితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి ప్రత్యేక హోదానే కావాలని అడిగింది వైఎస్ఆర్సీపీ మాత్రమే అని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో ఆ పార్టీకే మా మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్రానికి న్యాయం చేయగలిగేది జగన్ మాత్రమే అని విజయసాయిరెడ్డి చెప్పారు.