అక్కడ టన్నుల కొద్దీ వంట గ్యాస్ గాల్లోకి వృధాగా వదిలేస్తున్నారు...ఎందుకంటే?...
తూర్పుగోదావరి: మనం ఎంతో జాగ్రత్తగా వాడుకునే వంట గ్యాస్ ను అక్కడ వృధాగా గాల్లోకి వదిలేస్తారు..నిజానికి వదిలేస్తారనేకంటే..వదలాల్సివస్తోందని చెప్పడం కరెక్టేమో...ఇలా ఎందుకు జరుగుతోంది?...ఈ విషయం తెలుసుకునేముందు మరొక విషయం గురించి తెలుసుకుందాం!
ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారులు గోకవరం మండలంలోని వీరలంకపల్లిలో ఉన్న ఉన్న హెచ్పీ గ్యాస్ ప్లాంటును తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా అధికారులకు ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేమిటంటే...ఆ ఒక్క ప్లాంట్ నుంచి ఎంతో విలువైన ఎల్పీజీ గ్యాస్ ఏడాదికి సుమారు 250 టన్నుల వేస్ట్ గా గాల్లోకి కలిసిపోతోందని... మరి ఎందుకు అంత గ్యాస్ వేస్ట్ అవుతుందంటే...అందుకు మనమే కారణం...నమ్మశక్యంగా లేదా?...అయితే చదవండి మరి!
కారణం...సిలిండర్లు పూర్తిగా...ఖాళీచేయక పోవడమే
ముందుగా వీరలంకపల్లి ప్లాంట్ విషయమే తీసుకుంటే ఇక్కడకు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం తిరిగి వచ్చే చాలా సిలిండర్లలో మిగిలిపోయిన గ్యాస్ ఉంటోంది. ఇదంతా వినియోగదారులు పూర్తిగా సిలిండర్లు ఖాళీ చేయకపోవడం వల్ల మిగిలిపోయిన గ్యాస్. ఇలా సుమారు 20 శాతం సిలిండర్లలో ఇలా వినియోగించని గ్యాస్ ఉంటుందని అధికారులతో అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనివల్ల తాము చాలా సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని...ఎలాగంటే గ్యాస్ ఖాళీ సిలిండర్ బరువు 15.2 కిలోలు ఉంటుందని...అదే పూర్తిగా నింపిన ఎల్పీజీ సిలిండర్ బరువు 29.5 కేజీల బరువు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గ్యాస్ ప్లాంట్ కు రీఫిల్లింగ్ కోసం వచ్చే చాలా సిలిండర్లలో గ్యాస్ ఎంతో కొంత మిగిలిఉండటం అనేది సిబ్బందికి ఇబ్బందికరంగా మారుతోంది.
యథాతథంగా...రీ ఫిల్లింగ్ సాధ్యం కాదు...
గ్యాస్ సిలిండర్లలో ఎల్పీజీ మిగిలివుండటం వల్ల వీటిని యథాతథంగా రీ ఫిల్లింగ్ చేయడం సాధ్యం కాదని సిబ్బంది చెబుతున్నారు. కారణం రీ ఫిల్లింగ్ చేయాల్సిన సిలిండర్ ఖాళీ అని సూచించేలా 15.2 కిలోల బరువు లేదా ఒక 100 గ్రాములు అటూ ఇటుగా ఉంటేనే మిషన్ ఆ సిలిండర్ ను నిర్ణీత పరిమాణంలో గ్యాస్ తో నింపుతుంది లేని పక్షంలో నిరాకరిస్తుంది. కానీ కొన్ని ఖాళీ సిలిండర్లు ఏకంగా 17 కిలోలు పైనే ఉంటున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఏదేని సిలిండర్ లో గ్యాస్ పూర్తిగా ఖాళీ కాకుండా ఉంటే దాన్ని మెషీన్ ఫిల్ చేయకపోతుండటంతో అలాంటి సిలిండర్లన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ తరువాత వాటిని ఏం చేస్తారంటే?...
ఇలా మిగిలిన గ్యాస్ ను...గాల్లోకి వదిలేస్తారు...
మరి అలా పక్కనపెట్టిన సిలిండర్లు అన్నింటిలో గ్యాస్ నింపాలంటే వాటిని అన్నింటినీ ఖాళీ చేస్తేనే సాధ్యం అవుతుంది. అందువల్ల సిబ్బంది లో కొందరు అదేపనిగా ఇలా అనేక సిలిండర్లలో మిగిలి పోయిన గ్యాస్ను బయటకు గాల్లోకి వదిలేస్తున్నారు. దీంతో ఇలా భారీ పరిమాణంలో గ్యాస్ గాల్లో కలసిపోతోంది. ఆ తరువాత వాటిని ఎల్పీజీ గ్యాస్ తో నింపుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఎల్పీజీ కనెక్షన్లు 15.66 లక్షలు ఉన్నాయి. వీటిలో దీపం పథకం కింద కేటాయించినవి 2.25 లక్షల వరకు ఉన్నాయి. వాటిలో ఈ ఒక్క ప్లాంట్ కి వచ్చే సిలిండర్లతోనే ఇలా ఏటా సుమారు 250 టన్నుల గ్యాస్ గాలిలో కలిసిపోతుందని అంచనా. ఇలా ఒక్క ప్లాంటులోనే ఈ పరిమాణంలో గ్యాస్ వేస్టయితే ఎన్నో కంపెనీల ప్లాంట్ల ద్వారా ఎంత గ్యాస్ వృధాగా పోతోందో ఆలోచించకతప్పదు.
ప్రధాన కారణాలు...ఇవే
ఇలా గ్యాస్ సిలిండర్ ను పూర్తిగా వినియోగించలేకపోవడానికి కారణం అవగాహన లేక కానే కాదు. సిలిండర్లో గ్యాస్ ఉందో లేదో తెలియని సందర్భాలు అరుదుగా మాత్రమే సంభవిస్తాయని, ఒకే సిలిండర్ ఉండటం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగక పోవడం ఈ రెండే సిలిండర్లలో గ్యాస్ మిగిలిపోవడానికి ప్రధాన కారణాలు అని అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల వద్ద ఒకే సిలిండర్ ఉండడంతో గ్యాస్ను పూర్తిగా వినియోగించపోయినా సిలిండర్ రాగానే దాన్ని తిరిగి ఇచ్చేసి నిండు సిలిండర్ పొందక తప్పని పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాగే గ్యాస్ సిలిండర్ల పంపిణీ సక్రమంగా జరగని డీలర్ల పరిధిలో రెండు సిలిండర్లు ఉన్నా మళ్లీ సిలిండర్ ఎప్పటికి తెస్తారో అనే భయంతో నష్టమని తెలిసినా ఇంకా కొంత గ్యాస్ ఉండగానే ఆ సిలిండర్ ఇచ్చేసి రెండోది సమకూర్చుకోవడం జరుగుతుందన్నారు.
ఇరువురికీ నష్టం...అవగాహన పెంచుకోండి
మనకి వచ్చే వంట గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని, ఖరీదైన గ్యాస్ ఇంకా మిగిలి ఉండగానే సిలిండర్లు పంపేస్తే వినియోగదారులమైన మనం నష్టపోవడమే కాకుండా రాయితీ ఇస్తున్న ప్రభుత్వం కూడా నష్టపోతుందని...ఈ విషయంపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని తూనికలు కొలతల శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు గ్యాస్ను వృథా చేయకూడదని...సిలిండర్లను తీసుకొచ్చే సిబ్బంది వద్ద బరువును పరిశీలించే యంత్రం ఉంటుందని...దీని ద్వారా సిలిండరు బరువును పరిశీలించుకొని డెలివరీ తీసుకోవడం, తిరిగి ఇవ్వడం చేయాలని వారు చెబుతున్నారు.